బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి.. | Incident in Khammam district | Sakshi
Sakshi News home page

బాలికపై అఘాయిత్యం చేసి.. పైనుంచి తోసేసి..

Jun 10 2026 6:10 AM | Updated on Jun 10 2026 6:10 AM

Incident in Khammam district

ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం 

భవనం ఐదో అంతస్తు నుంచి బాధితురాలిని 

తోసేసిన నిందితుడు... తీవ్ర గాయాలతో 

చికిత్స పొందుతున్న బాలిక.. నిందితుడి అరెస్ట్‌ 

నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందిస్తామన్న మంత్రి పొంగులేటి

ఖమ్మం క్రైం: ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ కీచకుడి దుర్మార్గం బట్టబయలైంది. వేసవి సెలవుల కోసం తాత ఇంటికి వచ్చిన ఓ 12 ఏళ్ల బాలికపై అతను అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆపై ఆ బాలికను హతమార్చేందుకు ప్రయత్నించిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు బాధితురాలు అసలు విషయం చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఖమ్మం టూటౌన్‌ సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే వ్యక్తి కుమార్తె తన భర్తతో గొడవపడి తండ్రి వద్దకు వచ్చి ఉంటోంది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా తల్లి, తాత వద్దకు వేసవి సెలవుల్లో వచ్చింది. అదే అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో ఉంటున్న మహ్మద్‌ గౌస్‌ (50) బాలికపై కన్నేశాడు. 15 రోజుల క్రితం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించగా బాలిక తన తల్లికి చెప్పింది. ఆమె ఈ విషయాన్ని ఓ ఫ్లాట్‌లోని మహిళకు చెప్పగా బాలికను ఒంటరిగా బయటకు పంపొద్దని సూచించింది. 

అదే అదునుగా.. : ఈ నెల 6న గౌస్‌ భార్య ఇంట్లో లేని వేళ తన ఫ్లాట్‌ ఉన్న అంతస్తులోకి బాలిక రావడాన్ని గమనించిన గౌస్‌.. ఆమెను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని బయటపెడుతుందనే ఉద్దేశంతో ఆమెను హతమార్చేందుకు ఐదో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. అనంతరం ఏమీ తెలియని వాడిలా కిందకు వచ్చి బాలిక కళ్లు తిరిగి పడిపోయి ఉంటుందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే సోమవారం సాయంత్రానికి కాస్త కోలుకున్న బాలిక.. అత్యాచారం, హత్యాయత్నం గురించి తన మేనమామకు చెప్పగా ఆయన ఇతర కుటుంబ సభ్యులతో కలిసి టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో గౌస్‌పై కేసు పెట్టారు. అనంతరం బాధితురాలి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. ఈ మేరకు గౌస్‌పై పోక్సో కేసుతోపాటు హత్యాయత్నం కూడా నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మంత్రి పొంగులేటి భరోసా..: బాలిక వెన్నెముక, పక్కటెముకలు విరిగిపోయాయని.. కోలుకోవడానికి చాలాకాలం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితురాలి తండ్రి, సర్పంచ్‌తో ఫోన్లో మాట్లాడారు. ‘ముందు పాప ప్రాణాలను కాపాడుకుందాం, అధైర్యపడకండి.. నేనున్నా’అని ధైర్యం చెప్పారు. బాలికకు అత్యున్నత వైద్యం అందించడం కోసం వెంటనే హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని.. వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని భరోసా ఇచ్చారు. నిందితుడిని చట్టపరంగా అత్యంత కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement