Hyderabad: హెరిటేజ్‌ పాల లారీ బీభత్సం.. చెల్లెల్ని బైక్‌పై తీసుకొస్తుండగా

Hyderabad: Two Killed In Heritage Lorry Accident At Vanastalipuram  - Sakshi

వాహనాలపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం

దుర్మరణం చెందిన అన్నా, చెల్లెలు

వనస్థలిపురం ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఘటన

సాక్షి, హైదరాబాద్‌: బ్రేకులు ఫెయిలై అతివేగంగా వచ్చిన హెరిటేజ్‌ పాల లారీ ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లడంతో అన్నా, చెల్లెలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం వనస్థలిపురంలో చోటుచేసుకుంది. సీఐ సత్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం..  హయత్‌నగర్‌లోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న బి.సురేశ్‌కుమార్‌ (47), నల్లగొండ పట్టణం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఎం.విజయలక్ష్మి (43) అన్నాచెల్లెళ్లు. విజయలక్ష్మి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమెకు సంబంధించిన ఎల్‌ఐసీ లోన్‌ కోసం మంగళవారం నగరానికి వచ్చారు. చెల్లెలిని సురేశ్‌కుమార్‌ తన బైకుపై నగరంలోని అమీర్‌పేట ఎల్‌ఐసీ కార్యాలయానికి తీసుకెళ్తున్నారు. 


సురేశ్‌కుమార్‌, విజయలక్ష్మి (ఫైల్‌) 

ఈ క్రమంలో వనస్థలిపురం సుష్మా చౌరస్తాకు రాగానే రెడ్‌ సిగ్నల్‌ పడడంతో ఆగారు. ఇదే  సమయంలో వెనక నుంచి వేగంగా బ్రేకులు ఫెయిలైన హెరిటేజ్‌ పాల లారీ వచ్చి సురేశ్‌కుమార్‌ బైకును ఢీకొట్టి మరో స్కూటీని ఢీకొని పాన్‌డబ్బా పైకి దూసికెళ్లింది. ఈ ప్రమాదంలో సురేశ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన విజయలక్ష్మిని సమీపంలోని ఓ ఆస్పత్రికి తరిలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. స్కూటీపై ఉన్న మరో వ్యక్తి మురళీమోహన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు సురేశ్‌కుమార్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సత్యనారాయణ తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ షేక్‌ బాషాను అదుపులోకి తీసుకున్నామని ఆయన చెప్పారు.  
చదవండి: మమత భేటీకి టీఆర్‌ఎస్‌ దూరం!

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top