
రాజేంద్రనగర్ అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు.
సాక్షి,రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్లో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ టాప్ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చున్నీతో ఉరివేసుకొని బలవన్మరణం చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఏడాది క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో కోర్టు మ్యారేజ్ చేసుకున్న పింకీ.. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులే కారణమా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. అమిష్ లోయా అనే వ్యక్తితో ఏడాది క్రితం పింకీ శర్మ వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజుల పాటు వీరి కాపురం సజావుగా సాగినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్య కలహాలు ప్రారంభమయ్యాయి.
అప్పటి నుంచి బయటకెళ్లటప్పుడు పింకీ శర్మను ఇంట్లో పెట్టి తాళం వేసేవాడని.. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా పింకీ శర్మ, అమిష్ మధ్య ఘర్షణ జరిగిందని సమాచారం. దీంతో పింకీ శర్మను ఇంట్లో పెట్టి బయటకు వెళ్లిపోయాడు. కాసేపటికి ఇంటికి తిరిగొచ్చేసరికి పింకీ శర్మ చున్నీతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.