దేశంలోనే అత్యధిక కాలేజీలున్న జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి
కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ఆలిండియా సర్వే ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ నివేదిక వెల్లడి
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం ఉన్నత విద్యకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఉన్నత విద్యారంగ పురోగతిని అంచనా వేసే కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషషన్ నివేదికను విడుదల చేసింది. దేశంలోనే అత్యధిక కాలేజీలు ఉన్న జిల్లాల జాబితాలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి మొదటి వరుసలో నిలిచాయి. విస్తృతమైన మౌలిక వసతులు, పెరిగిన విద్యార్థినుల సంఖ్య, సాంకేతిక విద్యా కోర్సులపై పెరుగుతున్న ఆసక్తితో మూడు జిల్లాలు విద్యారంగంలో సరికొత్త రికార్డులను సృష్టించాయి.
హైదరాబాద్ జిల్లాలో సంప్రదాయ కళాశాలలతోపాటు వైద్య, న్యాయ విద్యాసంస్థలు కేంద్రీకతమై ఉండగా రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సులకు నిలయంగా మారాయి. ఐటీ కారిడార్ విస్తరణ, మెట్రో కనెక్టివిటీ, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండటంతో ఈ జిల్లాల్లో కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి.
జాతీయ సగటుతో పోలిస్తే ప్రతి లక్ష జనాభాకు ఇక్కడ ఉన్న కాలేజీల సంఖ్య (కాలేజీ డెన్సిటీ) చాలా ఎక్కువగా ఉండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం విద్యార్థులు ఇక్కడికి వస్తుండటంతో విద్యా ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. రాబోయే రోజుల్లో పరిశ్రమల అనుసంధానం, నిరంతర అధ్యాపక నియామకాలు చేపడితే ఈ ప్రాంతం గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
మహిళా సాధికారత
విద్యారంగంలో లింగ నిష్పత్తిపరంగా హైదరాబాద్ వృద్ధిని కనబరిచింది. గతంలో కేవలం ఆర్ట్స్, కామర్స్ కోర్సులకే పరిమితమైన అమ్మాయిలు, ఇప్పుడు సాంకేతిక పరిశోధన రంగాల్లోకి సైతం పెద్ద ఎత్తున అడుగుపెడుతున్నారు. హైదరాబాద్లో ఉన్నత విద్యలో చేరే అమ్మాయిల శాతం అబ్బాయిల కంటే ఎక్కువగా నమోదు కావడం విశేషం.
మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని హాస్టల్ వసతులు, మెరుగైన భద్రతా ప్రమాణాలు తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచాయి. ముఖ్యంగా పీజీ, పీహెచ్డీ వంటి ఉన్నతస్థాయి పరిశోధనల్లో మహిళల నమోదు శాతం 1.10 కంటే ఎక్కువ జీపీఐ సాధించి మహిళా సాధికారతను చాటుతోంది. ప్రభుత్వ స్కాలర్ర్థిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు కూడా విద్యార్థినులు చదువు మధ్యలో ఆపేయకుండా ముందడుగు వేయడానికి ప్రధాన దోహదకారులుగా నిలిచాయి.
సాంకేతికత జోరు
హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్గా ఎదగడం ఇక్కడి ఉన్నతవిద్య కోర్సుల ఎంపికపై స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజా సర్వే ప్రకారం రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో 45 శాతానికిపైగా విద్యార్థులు ‘స్టెమ్’కోర్సుల్లోనే చేరుతున్నారు. ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులను కాలేజీలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు వాటి వైపు పరుగులు తీస్తున్నారు.
హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా, జేఎన్టీయూ అనుబంధ కాలేజీల్లో సీట్ల భర్తీ రేటు గతంకంటే మెరుగైంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను మార్చడం వల్ల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెరిగి, విద్యార్థులు ఈ జిల్లాల్లోని విద్యా సంస్థల్లో చేరడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మౌలిక వసతుల విస్తరణ
ఉన్నత విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల లభ్యతపై సర్వే ఆశాజనకమైన విషయాలను వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని 90 శాతానికిపైగా కాలేజీలు వైఫై సదుపాయం, స్మార్ట్ క్లాస్రూమ్లు, డిజిటల్ లైబ్రరీలను కలిగి ఉన్నాయి. జాతీయ విద్యా విధానం సంస్కరణల్లో భాగంగా ప్రయోగాత్మక అభ్యసనానికి ప్రాధాన్యం ఇస్తుండటంతో లేబొరేటరీల ఆధునీకరణ వేగంగా జరిగింది.
విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ కేంద్రాలు, క్రీడా ప్రాంగణాలు, పరిశోధన ఇంక్యుబేషషన్ సెంటర్ల ఏర్పాటులో ఈ మూడు జిల్లాలు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయి. అయితే పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని ప్రభుత్వ కాలేజీల్లో హాస్టల్ వసతులను మరింత పెంచాల్సిన అవసరం ఉందని కూడా నివేదిక స్పష్టం చేసింది.


