ఏడేళ్లకే నూరేళ్లు నిండాయా బిడ్డా..
రెండో అంతస్తు నుంచి పడి బాలుడి మృతి
సాక్షి,సనత్నగర్: భవనంపై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ రెండో అంతస్తు నుంచి పడి మృతి చెందిన ఘటన సనత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన దత్తు కుమార్, పూజ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చి ఫతేనగర్ జింకలవాడలో ఉంటున్నారు. దత్తుకుమార్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దత్తుకుమార్ భార్య పూజ దుస్తులు ఉతుకుతుండగా, కుమారుడు ఏసురాజ్ (7) భవనం రెండో అంతస్తులో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి బాలుడు కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సనత్నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.