ఆ చెట్లకి డై బ్యాక్‌ వ్యాధి.. ఆందోళనలో అధికారులు | Sakshi
Sakshi News home page

ఆ చెట్లకి డై బ్యాక్‌ వ్యాధి.. ఆందోళనలో అధికారులు

Published Thu, Nov 18 2021 10:42 PM

Hyderabad: Agriculture Officer Precautions Neem Tree Survival - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వేప చెట్లు డై బ్యాక్‌ వ్యాధితో ‘ఫోమోప్సిస్‌ అజాడిరిక్టే’అనే శీలీంధ్రం సోకి ఎండిపోయి, చనిపోతున్న నేపథ్యంలో వ్యవసాయశాఖ ఆందోళన వ్యక్తంచేసింది. దేశ కల్పతరువు, సహజ సంజీవిని, ఆరోగ్య ప్రదాత, ఆరోగ్య మంజరి అయిన వేప నేడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నందున దీన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఒక ప్రకటనలో కోరింది. ఈమేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు తమ సామాజిక బాధ్యతగా ఉద్యమించి వేప చెట్టుకు జీవం పోసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

కార్బెండిజమ్‌ (50 శాతం డబ్ల్యూపీ) మందును లీటర్‌ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిచేలా పోస్తే వేర్లు, కాండం మొదలులో ఉన్న శీలీంధ్రాన్ని.. ఈ మందు సమర్థవంతంగా అరికడుతుందని పేర్కొంది. ఏడు రోజుల తర్వాత థయోఫనేట్‌ మిథైల్‌ (70 శాతండబ్ల్యూపీ) మందును లీటర్‌ నీటిలో 2 గ్రాములు కలిపి చెట్టు మొదలు పూర్తిగా తడిసేలా పోస్తే చెట్టు మొత్తానికి ఈ మందు చేరుకుని శీలీంధ్రాన్ని నాశనం చేస్తుందని తెలిపింది. ఇది మార్కెట్లో రోకో, థెరపీ తదితర పేర్లతో దొరుకుతుందని పేర్కొంది. 20 రోజుల తర్వాత మూడోచర్యలో భాగంగా ప్రోఫినోపాస్‌ మందును లీటర్‌ నీటిలో 3 మి.లీ. కలిపి చెట్టు మొదలు తడిచేలా పోయాలని తెలిపింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.

చదవండి: Hyderabad: మాకొద్దు సారూ ఈ తిండి..! చారు నీళ్లలాగా.. కూరలు చారులాగా, గుడ్ల సంగతి సరేసరి..

Advertisement
Advertisement