కొలనుపాక దేవాలయ పైకప్పుపై వందల ఏళ్లనాటి పెయింటింగ్స్
ఇంతకాలం పొగచూరి మాయం.. తాజాగా శుభ్రం చేయగా వెలుగులోకి..
చాలా ఆలయాల్లో సున్నపు పూతలు, మసి పొరలనుతొలగిస్తే తిరిగి చూసే వీలు
కెమికల్ ట్రీట్మెంట్తో మెరుగ్గా కనిపించే అవకాశం
అందుకు నిధులు కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం
ఇది వందల ఏళ్ల క్రితం దేవాలయం పైకప్పు మీద చిత్రించిన పురాణగాథను ప్రతిబింబించే ఓ వర్ణచిత్రం. కానీ, సమీపంలో భారీ దీపాలు, కాగడాలు వెలిగిస్తుండటంతో వాటిమీద మసి పొరలు కమ్మి అద్భుత, అపురూప చిత్రాలు కనుమరుగయ్యాయి. తాజాగా ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా పైకప్పు మసి పొరలు తొలగించటంతో అవి వెలుగుచూశాయి. కెమికల్ ట్రీట్మెంట్ చేయిస్తే అవి స్పష్టంగా కనిపించనున్నాయి. ఇది కొలనుపాక సోమేశ్వరాలయంలో చోటుచేసుకున్న ఘటన. –సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో కాకతీయులు, వారికి పూర్వం నిర్మించిన ఎన్నో దేవాలయాలున్నాయి. వాటిల్లో కూడా ఇలాంటి అద్భుత వర్ణచిత్రాలుంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని కాకతీయ త్రికూటాలయంలో శైవ, వైష్ణవ పురాణ గాథల్లోని చిత్రాలు ఇలాగే అనూహ్యంగా వెలుగుచూశాయి. అంతరించిన ఈ ఆలయ చిత్రకళా వైభవాన్ని మళ్లీ ప్రజల ముందుంచాలంటే దేవాలయాల్లో వాటిని గుర్తించాల్సి ఉంది. పిల్లలమర్రి దేవాలయంలో కెమికల్ ట్రీట్మెంట్తో వాటిని కాపాడిన రాష్ట్ర వారసత్వ శాఖ సిద్ధంగా ఉన్నా, అందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం కేటాయించడం లేదు.
ఏంటీ చిత్రాలు... : అంతగా అక్షరాస్యత లేని కాలంలో పురాణ గాథలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆలయాల్లో ఇలా చిత్రాలు గీసి చూపటం కూడా ఓ పద్ధతి. పురాతన దేవాలయాలు కేవలం శిల్పకళా నిలయాలు మాత్రమే కాదు, అవి అద్భుత చిత్రకళా వేదికలు కూడా. నాటి రాజులు, శిల్పులు దేవాలయాల పైకప్పులను, రాతి దూలాలను కాన్వాసుగా మార్చేశారు. వాటిపై పురాణగాథలను, రాచరిక వైభవాలను రంగురంగుల చిత్రాలుగా ప్రాణప్రతిష్ట చేశారు. ఈ చిత్రకళా సంప్రదాయం శాతవాహనుల కాలంలోనే మొదలైంది.
కాకతీయుల కాలంలో మరింతగా విస్తరించి, విజయనగర సామ్రాజ్య కాలంలో అద్భుతంగా వరి్ధల్లింది. అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ఇందుకు సజీవ సాక్ష్యం. ఇక్కడి పైకప్పులపై గీసిన చిత్రాలు ఆసియాలోనే అతిపెద్ద గోడచిత్రాలుగా అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. ఈ చిత్రాలు వందల ఏళ్లపాటు మనగలిగేలా నాటి చిత్రకారులు పూర్తిగా సహజసిద్ధ రంగులను మాత్రమే వాడేవారు. చిత్రించేచోట ముందుగా సున్నం, జనపనార, బెల్లం నీరు, కరక్కాయల మిశ్రమం పూసేవారు. ఆ పూత తడిగా ఉన్నప్పుడే రంగులు వేసేవారు. దీనివల్ల రంగు రాతి పొరల్లోకి ఇంకిపోయి శతాబ్దాలైనా చెరిగిపోకుండా ఉంటుంది.

ఆసక్తి చూపని సర్కారు
ఇక మరమ్మతులు, ఆధునీకరణ పేరుతో పురాతన దేవాలయాల గోడలు, పైకప్పులపై సున్నపు పూతలతో చాలా దేవాలయాల్లోని చిత్రాలు కనిపించకుండాపోయాయి. ప్రస్తుతం అత్యాధునిక కెమికల్ వాషింగ్ పద్ధతుల ద్వారా కొన్ని ఆలయాల్లో పైకప్పులపై దశాబ్దాలుగా ఉన్న సున్నపు పొరలను జాగ్రత్తగా తొలగిస్తూ, లోపల దాగున్న అసలైన పురాతన చిత్రాలను వెలుగులోకి తెచ్చే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కానీ, ప్రభుత్వం ఆ దిశగా ఆసక్తి చూపకపోవటంతో తెలంగాణలో ఆ ప్రక్రియ జరగటం లేదు.
వర్ణచిత్రాలున్నాయి...
ఇప్పటికీ చాలా దేవాలయాల్లో అతి పురాతన వర్ణచిత్రాలున్నాయని తాజాగా కొలనుపాక దేవాలయం చాటిచెప్తోంది. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా మసి పొరలు తొలగించగా అస్పష్టంగా చిత్రాలు కనిపించాయి. వీటిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు సిరిపురం నరేందర్ తొలుత గుర్తించగా, తాజాగా ఆ బృంద సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, ముల్లక్కల రవికుమార్, కుండె గణేశ్, మేఘరాజు ఈ చిత్రాలను పరిశీలించి విశ్లేషించారు. పురాణగాథ చిత్రాల్లో విశ్వబ్రహ్మను, ‘శరభ’, సంగరోలు’లాంటి తెలుగు లిపి పదాలు కనిపించాయని వారు చెప్పారు. ఇవి కాకతీయ కాలం తదనంతర చిత్రాలై ఉండొచ్చన్నారు.


