
వైద్య విధాన పరిషత్ పరిధిలోని 156 ఆసుపత్రులకు వైద్య సిబ్బంది కొరత
2,988 మంది డాక్టర్లు, 1,205 నర్సు పోస్టులు ఖాళీ
1,348 పారామెడికల్, సుమారు 1,500 ఇతర సిబ్బంది పోస్టులు కూడా..
అరకొరగా ఉన్న వైద్యులతోనే నడుస్తున్న జిల్లా,ఏరియా ఆసుపత్రులు, సీహెచ్సీలు
జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులను పేదలు ఆశ్రయించాల్సిన పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా దవాఖానాల్లో వైద్యులు, నర్సుల కొరత వేధిస్తోంది. దీంతో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రోగులకు మెరుగైన చికిత్స అందించడం కష్టంగా మారింది. వైద్యుల కొరత వల్ల పేదలు సాధారణ జ్వరం మొదలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు చికిత్స కోసం జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. కొన్ని ఆసుపత్రుల్లో కనీసం ఒక రెగ్యులర్ డాక్టర్ కూడా ఉండటం లేదు. తాత్కాలిక సర్దుబాటు ద్వారా కొంత మేర భారం తట్టుకొనే ప్రయత్నం చేస్తున్నా పేదలకు సేవలు పూర్తిగా అందడం లేదు.
వేలల్లో ఖాళీలు..
వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉన్న 178 ఆసుపత్రుల్లో 12,270 పడకలు ఉన్నాయి. జిల్లా ఆసుపత్రుల్లో 350 పడకల సామర్థ్యం ఉండగా 99 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 30, 50, 80 పడకల సామర్థ్యం ఉంది. 71 ఏరియా ఆసుప్రతుల సామర్థ్యం 100 నుంచి 250 వరకు ఉంది. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం మంజూరు చేసిన డాక్టర్లు 4,357 కాగా ప్రస్తుతం ఉన్నది 1,369 మంది మాత్రమే. అంటే 2,988 మంది డాక్టర్లు ఆయా ఆసుపత్రుల్లో లేరు.
అలాగే ఈ ఆసుపత్రుల్లో 4,200 మంది నర్సులు విధులు నిర్వర్తించాల్సి ఉండగా 2,995 మందే పనిచేస్తున్నారు. అంటే 1,205 మంది నర్సులకు కొరత ఏర్పడింది. ఇక పారామెడికల్ పోస్టులు 1,880కిగాను 532 మాత్రమే భర్తీ అవగా ఇంజనీరింగ్ విభాగంలో 48కిగాను 6 పోస్టులే భర్తీ అయ్యాయి. 743 మినిస్టీరియల్ పోస్టుల్లో 137 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా టీవీవీపీ పరిధిలోని ఆసుపత్రులలో 12,588 మంజూరు పోస్టులకుగాను 6,586 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.
కేడర్ పోస్టులను కేటాయించకపోవడంతో..
రాష్ట్రంలోని 33 జిల్లాలలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని ఆసుపత్రులే ప్రధానంగా పేదలకు, గ్రామీణ వర్గాలకు సేవలు అందిస్తున్నాయి. టీవీవీపీ పరిధిలో ప్రస్తుతం 178 ఆసుపత్రులు ఉండగా అందులో రోగులకు సేవలు అందిస్తున్నవి 156 మాత్రమే. మిగతా ఆసుపత్రులు నిర్మాణ దశలో కొన్ని, కాగితాలపై మరికొన్ని ఉన్నాయి. మరో ఐదు ఆసుపత్రులను కూడా టీవీవీపీ పరిధిలోకి తెచ్చినప్పటికీ వాటి సేవలు మొదలు కాలేదు.
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) పరిధిలో గతేడాది వరకు కొనసాగిన దాదాపు 90కిపైగా ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల (సీహెచ్సీ)లను తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోకి మార్చగా ఆ ఆసుపత్రులకు కేడర్ పోస్టులను కేటాయించకపోవడంతో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువైంది. అదే సమయంలో టీవీవీపీ పరిధిలో ఉన్న 31 జిల్లా ఆసుపత్రులను వైద్య బోధనా ఆసుపత్రులుగా మార్చి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకు ప్రభుత్వం తీసుకొచి్చంది.
డీఎంఈ పరిధిలోకి 31 ఆసుపత్రులు
కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలోని 33 జిల్లా ఆసుపత్రులలో 31 ఆసుపత్రులను ప్రభుత్వం బోధన ఆసుపత్రులుగా మార్చింది. దీంతో హైదరాబాద్లోని కింగ్కోఠి, వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఆసుపత్రులు మాత్రమే టీవీవీపీ కింద మిగిలాయి. అయితే కొడంగల్లో మంజూరైన మెడికల్ కళాశాల కోసం తాండూరు ఆసుపత్రిని కూడా డీఎంఈ పరిధిలోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో టీవీవీపీ కింద మిగిలిన జిల్లా ఆసుపత్రి కింగ్కోఠి హాస్పిటల్ ఒక్కటే. ఈ తరలింపుతో టీవీవీపీకి సంబంధించిన ఆసుపత్రుల సంఖ్య తగ్గినా, డీహెచ్ నుంచి టీవీవీపికి అటాచ్ చేసిన సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత తీవ్ర సమస్యగా మారింది. ఈ సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ, నియామకాలు జరపడం లేదు.
టీవీవీపీని సెకండరీ డైరెక్టరేట్గా మారిస్తేనే..
వైద్య విధాన పరిషత్కు స్వతంత్ర హక్కులను ప్రభుత్వం కేటాయించకపోవడంతో అదో ప్రత్యేక కేటగిరీగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో టీవీవీపీని ప్రత్యేకంగా సెకండరీ హెల్త్ డైరెక్టరేట్గా గుర్తించి ప్రత్యేక నియామకాల ద్వారా సిబ్బంది కొరత తీర్చాలన్న డిమాండ్ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం ద్వారా టీవీవీపీని రద్దు చేసి సెకండరీ హెల్త్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఏడాది క్రితమే నిర్ణయించినా ఇప్పటివరకు ముందడుగు పడలేదు.