Hydra: హెచ్‌ఎండీఏ అధికారుల్లో ‘హైడ్రా’ గుబులు! | HMDA officials Tension With Hydra | Sakshi
Sakshi News home page

Hydra: హెచ్‌ఎండీఏ అధికారుల్లో ‘హైడ్రా’ గుబులు!

Sep 10 2024 7:15 AM | Updated on Sep 10 2024 3:20 PM

HMDA officials Tension With Hydra

చెరువులు, కుంటలు, పార్కు స్థలాల్లో నిర్మాణాలు 

అప్పట్లో అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు

తప్పుడు మ్యాపులు వినియోగించినట్లు ఆరోపణలు 

ఎలాంటి చర్యలు ఉంటాయోనని ఇప్పుడు టెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు గతంలో అడ్డగోలుగా అనుమతులిచ్చిన కొందరు హెచ్‌ఎండీఏ అధికారులను హైడ్రా హడలెత్తిస్తోంది. చెరువులు, కుంటలు, పార్కు స్థలాలను ఆక్రమించుకొని  చేపట్టిన భవనాలకు కొందరు  అధికారులు నిర్మాణ సంస్థలు, బిల్డర్లతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా అనుమతులను ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తప్పుడు మ్యాపుల ఆధారంగా కొందరు అక్రమాలకు  పాల్పడితే ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఇచి్చన నిరభ్యంతర పత్రాల ఆధారంగా మరి కొందరు నిర్మాణ అనుమతులను ఇచ్చారు. 

ఇలా హెచ్‌ఎండీఏ పరిధిలో గత ఐదారేళ్లుగా వందల కొద్దీ అక్రమ కట్టడాలు వెలిశాయి. చివరకు పార్కు స్థలాలను సైతం వదిలిపెట్టకుండా చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు హెచ్‌ఎండీఏ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌లలో చేపట్టిన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని అప్పట్లో పలు సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ అవి బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం అలాంటి నిర్మాణాలన్నింటిపైన హైడ్రా బుల్డోజర్‌ను  ఎక్కుపెట్టడంతో అధికారుల్లో గుబులు మొదలైంది. 

ఇప్పటికే అక్రమ నిర్మాణానికి అనుమతినిచి్చన ఓ సహాయ ప్లానింగ్‌ అధికారిపైన చర్యలకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరి కొందరు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాల నెపాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపైన నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారు. కానీ హెచ్‌ఎండీఏ ప్లానింగ్‌ విభాగానికి చెందిన ఏపీఓలు, జేపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించిన తరువాత మాత్రమే ఫైళ్లు కదులుతాయి. ఈ క్రమంలో సదరు అధికారులు అన్ని అంశాలను సీరియస్‌గా పరిశీలించవలసి ఉంటుంది. ఈ పరిశీలన క్రమంలోనే అక్రమాలకు  తెరలేస్తున్నట్లు ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. 

పాత మ్యాపులతో మాయ... 
‘చెరువులు, కుంటలు, పార్కులు ఉన్న చోట భవనాలు కట్టే క్రమంలో అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో సదరు స్థలం బఫర్‌జోన్‌లో ఉన్నట్లు తేలితే  గూగుల్‌మ్యాపులను దరఖాస్తులతో జత చేస్తున్నారు. కొన్ని చోట్ల మాస్టర్‌ప్లాన్‌ (2013) కంటే ముందు ఉన్న మ్యాపులను పెట్టేస్తున్నారు’ అని ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధి విస్మయం వ్యక్తం చేశారు. 

హెచ్‌ఎండీఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ మాత్రమే ప్రామాణికమైనదని చెప్పే అధికారులు అందుకు విరుద్ధంగా పాత మ్యాపులతో అనుమతులకు లైన్‌లు క్లియర్‌ చేయడం గమనార్హం. మరోవైపు కొందరు ప్లానింగ్‌ అధికారులే బడా నిర్మాణ సంస్థలకు  కన్సల్టెంట్లుగా, లైజనింగ్‌ అధికారులుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. పటాన్‌చెరు, ఇస్నాపూర్, దుండిగల్, ఘట్కేసర్, శంషాబాద్, మేడ్చల్, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్‌ తదితర ప్రాంతాల్లో లేక్‌వ్యూప్రాజెక్టుల పేరిట వెలిసిన పలు అపార్ట్‌మెంట్‌లకు ఇలాంటి అనుమతులు లభించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి.

 గతంలో కొన్ని నిర్మాణాలను హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులే స్వయంగా గుర్తించినప్పటికీ రకరకాల ఒత్తిళ్ల కారణంగా ఎలాంటి చర్యలను తీసుకోలేకపోయారు. కొందరు  రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మౌనంగా ఉండిపోతే మరి కొందరు నిర్మాణ సంస్థల నుంచే  వచ్చే ఆఫర్‌లను దృష్టిలో ఉంచుకొని మౌనం వహించారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇటీవల హైడ్రా అధికారులు అమీన్‌పూర్‌ లేక్‌ చుట్టుపక్కల పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలను గుర్తించారు.ఇదే  ప్రాంతంలో అప్పట్లో క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహించిన  ఓ ఏపీఓ స్థాయి  అధికారి ఫ్లాట్‌లను బహుమతులుగా పొంది మ్యాపులను మాయ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. 
అప్పుడు ఇష్టారాజ్యంగా అడ్డగోలు అనుమతులు ఇచి్చన అధికారులు, ఉద్యోగులు.. హైడ్రా చర్యలతో ఇప్పుడు బెంబేలెత్తుతున్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకొనేందుకు రకరకాల మార్గాలను అన్వేíÙస్తున్నారు. అదే సమయంలో కొత్తగా వచ్చే ఫైళ్లపైన ఆచితూచి ముందుకెళ్తున్నారు. నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టేస్తున్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో  ఉన్నా, లేకున్నా ఎన్‌ఓసీల కోసం షార్ట్‌ఫాల్స్‌ పెట్టి వేధిస్తున్నట్లు దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ‘అప్పట్లో అనుమతులు ఇచి్చన  ప్రాంతంలోనే ఇప్పుడు ఇరిగేషన్‌ నుంచి ఎన్‌ఓసీ కావాలని అడుగుతున్నారు. మున్సిపాలిటీ అనుమతులపైన భవనాలను నిరి్మంచిన చోట అదనపు అంతస్థుల కోసం దరఖాస్తు చేసుకొంటే  రెవెన్యూ, ఇరిగేషన్‌ అనుమతి కావాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అని బాలాపూర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, తదితర ప్రాంతాలకు చెందిన భూ యజమానులు ప్రశ్నిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement