‘భూదాన్‌’పై సీబీఐ విచారణ! | High Court On Bhoodan lands grabbing and investigation into irregularities | Sakshi
Sakshi News home page

‘భూదాన్‌’పై సీబీఐ విచారణ!

Apr 25 2025 12:59 AM | Updated on Apr 25 2025 12:59 AM

High Court On Bhoodan lands grabbing and investigation into irregularities

భూకబ్జా, అక్రమాలపై దర్యాప్తునకు సన్నద్ధత తెలియజేయాలని హైకోర్టు ఆదేశం

ఆరోపణలున్న వారంతా కీలక బాధ్యతల్లోని ఉన్నతాధికారులే..

అందుకే నాగారంలోని ఆ సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెడుతున్నాం

తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆ భూములను బదిలీ చేయొద్దు

ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం

పిటిషన్‌ ఉపసంహరణకు రిజిస్ట్రీ అంగీకరించొద్దు

ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు

విచారణ జూన్‌ 12కు వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా భూదాన్‌ భూముల కబ్జా, అక్రమాలపై దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చడానికి సీబీఐ విచారణ జరి పించాలని హైకోర్టు నిర్ణయించింది. దీనికి సన్న ద్ధంగా ఉన్నారా? లేరా? అనే దానిపై వైఖరిని తెలియజేయాలని సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా కీలక స్థానాల్లోని ఉన్నతాధికారులని, వారిపై ఆరోపణలు కూడా అంతే తీవ్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. 

తీర్పు వెలువడే వరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని అధికారులకు స్పష్టం చేసింది. తమ ముందున్న పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాజ్యాంగం కల్పించిందని, ఆ మేరకు ఆర్టికల్‌ 226ను వినియోగించుకుని ఈ ఆదేశాలు ఇస్తున్నామని తేల్చిచెప్పింది. 

తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆ భూములను విక్రయించడం, బదిలీ చేయడం సహా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ప్రతివాదులకు స్పష్టంచేసింది. అదీగాక, ఆరోపణల తీవ్రత దృష్ట్యా పిటిషన్‌ ఉపసంహరించుకునే అవకాశాన్ని పిటిషనర్‌కు ఇవ్వడం లేదని పేర్కొంది. ఒకవేళ పిటిషనర్‌ ఉపసంహరించుకోవాలని భావించినా అనుమతించవద్దని రిజిస్ట్రీని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

భూకబ్జాలో 26 మంది ఉన్నతాధికారులు: రంగా రెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో భూ కబ్జాలపై ఫిబ్రవరి 16న, మార్చి 8న అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ అంబర్‌పేట్‌కు చెందిన బిర్లా మహేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీనియర్‌ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని కాజేసే చర్యలు చేపట్టారన్నారు. 

ఇప్పటికే కొందరు అనధికారికంగా భూములను బదిలీ కూడా చేయించుకున్నారని చెప్పారు. 26 మంది ఉన్నతాధికారులు భూకబ్జాలో ఉన్నందున ఈ అంశంపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

అధికారుల నుంచి స్పందన లేదు..
పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘భూదాన్‌ భూములపై బినామీల పేరిట రిజిస్ట్రేషన్, భూ కబ్జా, మనీలాండరింగ్‌పై విచారణ జరిపించాలని మహేశ్‌ పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఈ కుంభకోణంలో ఉన్నారు. 

కొందరు అధికారులకు అందజేసిన పట్టాదారు పాస్‌బుక్‌లు, మ్యుటేషన్‌ ప్రొసీడింగ్‌లపై వివరాలు సమర్పించేలా రిజిస్ట్రేషన్, స్టాంపుల కమిషనర్, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌కు ఆదేశాలు జారీ చేయండి. భూకబ్జాలో తెలంగాణతోపాటు ఏపీకి చెందిన సీనియర్‌ అధికారుల పాత్ర ఉంది. పిటిషనర్‌కు హక్కుగా ఉన్న భూమిని మోసపూరితంగా బదిలీ చేసుకున్నట్లు అధికారులు తప్పుడు డాక్యుమెంట్లు చూపించారు. 

అధికారులు భూరికార్డులను ఎలా తారుమారు చేశారో, తప్పుడు వారసత్వ పత్రాలు ఎలా తయారయ్యాయో.. పట్టాదార్‌ పాస్‌బుక్‌లను చట్టవిరుద్ధంగా ఎలా జారీ చేశారో దర్యాప్తు చేయాల్సి ఉంది. ధరణి పోర్టల్‌ను కూడా దుర్వినియోగం చేశారు. తన భూమి కోసం పోరాడుతున్న పిటిషనర్‌కు సాయం చేసే బదులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే 10కిపైగా లీగల్‌ నోటీసులు పంపారు. 

క్షమాపణ చెప్పకపోతే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. మోసపూరిత పాస్‌బుక్‌లను రద్దు చేయాలి. భూమిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకోవాలి. సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించాలి’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇది అతి పెద్ద భూ కుంభకోణంలా కనిపిస్తున్నందున ఆ భూములకు సంబంధించి తదుపరి లావాదేవీలన్నింటినీ నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 12కు వాయిదా వేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement