
ఆసుపత్రిని సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
డైట్ కాంట్రాక్టర్ తొలగింపు
కలుషిత ఆహారంతోనే రోగులకు అస్వస్థత: నిజనిర్ధారణ కమిటీ
సాక్షి, హైదరాబాద్/శ్రీనగర్కాలనీ: ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలలో కలుషితాహారం తిని ఒకరు మృతి చెందడంతోపాటు 92 మంది అస్వస్థతకు గురైన ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం ఉదయం ఆసుపత్రిని సందర్శించారు. సంఘటనకు గల కారణాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితను అడిగి తెలుసుకున్నారు.
అస్వస్థతకు గురైన రోగులను పరామర్శించిన ఆయన, జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. కాగా, ఆసుపత్రికి కలుషిత ఆహార పదార్థాలను సరఫరా చేసిన డైట్ కాంట్రాక్టర్ జైపాల్రెడ్డిని తొలగించాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధితులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. అస్వస్థతకు గురైన వారందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
అధికారులు అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మంత్రి ఉస్మానియాలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్తో మాట్లాడి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. ఈ నెల రెండున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అందించిన ఒక స్వీట్ వల్లే ఇది జరిగిందని వైద్య సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారని, ఇతర ఆహార పదార్థాలతోపాటు వాటి శాంపిల్స్ కూడా పరీక్షలకు పంపించామని మంత్రి తెలిపారు.
పరీక్షల అనంతరం వచ్చిన నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, నిజనిర్ధారణకోసం డీఎంఈతో కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే బోరబండ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఆసుపత్రిలో ఇలాంటి సంఘటన జరగడం, ఓ రోగి చనిపోవడం బాధాకరమని ఎంపీ అనిల్కుమార్యాదవ్ అన్నారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
కలుషిత ఆహారం వల్లే ఘటన..
రోగుల అస్వస్థతకు ప్రధాన కారణం కలుషిత ఆహారమేనని నిజనిర్ధారణ కమిటీ తేల్చింది. డీఎంఈ డాక్టర్ రాజేంద్రకుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితలు విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మజను ఆ విధులనుంచి తప్పించి.. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. అలాగే ఆమె స్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ బి.శంకర్కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించింది.