
ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్లో నిరుపయోగంగా ఇమ్యునో ఎనలైజర్ మిషన్
పేదలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడని ప్రభుత్వ వైద్య పరీక్షల కేంద్రాలు
సిబ్బంది కొరతతో చాలా కేంద్రాల్లో నిరుపయోగంగా పరికరాలు
మరికొన్ని హబ్లలో అందుబాటులో లేని రీ ఏజెంట్లు
134 పరీక్షలకుగాను 30–40 టెస్ట్లకే పరిమితమవుతున్న వైనం
పరీక్షల ఫలితాల కోసం రోగులు 2 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి
పేదలు అనివార్యంగా ప్రైవేటు డయాగ్నొస్టిక్
కేంద్రాలను ఆశ్రయించాల్సిన దుస్థితి
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్’ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. రూ. కోట్లు వెచ్చించి అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది లేకపోవడంతో చాలా కేంద్రాల్లో పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. మరికొన్ని చోట్ల వైద్య పరీక్షలకు అవసరమైన రసాయనాల కొరత కూడా నెలకొంది. దీంతో చాలా జిల్లాల్లో పేదలు అనివార్యంగా రూ. వేలు ఖర్చుపెట్టి మళ్లీ ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది.
32 జిల్లాల్లో హబ్స్.. 1,546 చోట్ల స్పోక్స్
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద హబ్ అండ్ స్పోక్ విధానంలో హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ప్రధాన హబ్గా తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ఏర్పాటైంది. ఆపై రాష్ట్రవ్యాప్తంగా హబ్లను విస్తరించారు. ప్రస్తుతం నారాయణపేట, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో 32 బయో కెమిస్ట్రీ, మైక్రోబయోలజీ, పాథలాజీ ల్యాబ్స్తో కూడిన హబ్స్ ఏర్పాటయ్యాయి. ఆదిలాబాద్లోని ఏజెన్సీ ప్రాంతంలోనూ ప్రత్యేక హబ్ను ఏర్పాటు చేశారు. పీహెచ్సీలు, బస్తీ, పల్లె దవాఖానాలు, కమ్యూనిటీ సెంటర్లు మొదలైన 1,546 చోట్ల స్పోక్స్ (చిన్న కేంద్రాలు)ను ఏర్పాటు చేశారు. తక్షణమే వచ్చే పరీక్షల ఫలితాలను స్పోక్స్లలో, ఇతర వైద్య పరీక్షలను హబ్లలో నిర్వహిస్తున్నారు.
పాథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయోలజీ పరీక్షలకు సంబంధించి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్ర పరికరాలు 32 హబ్లలో ఉన్నాయి. సాధారణ మధుమేహ వ్యాధిని నిర్ధారించే పరీక్షలు మొదలుకొని మూత్రపిండాల వ్యాధి నిర్ధారణకు క్రియాటిన్ పరీక్షల వరకు, కేన్సర్ పరీక్షకు వినియోగించే సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల వరకు హబ్లలో అందుబాటులో ఉన్నాయి. పాథాలజీ, రేడియాలజీ సేవలు, అ్రల్టాసౌండ్, టెలి ఈసీజీ, ఎక్స్రే, మామోగ్రామ్, 2డీ ఎకో పరీక్షలన్నీ ఈ కేంద్రాల్లో జరుగుతాయి. ఏదైనా తగ్గని జబ్బుతో రోగి బాధ పడుతుంటే ఆ జబ్బు మూలాలను కనుక్కొని, తగిన మందులు సిఫారసు చేసేందుకు వీలుగా ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’టెస్టులు కూడా ఈ హబ్లలో జరిపేందుకు వీలుంది.
ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టుల కొరతతో..
రాష్ట్రవ్యాప్తంగా 32 హబ్లలోని మైక్రోబయోలజీ ల్యాబ్లలో ‘కల్చర్ అండ్ సెన్సిటివిటీ’పరీక్షల కోసం సుమారు రూ. 50 లక్షల విలువైన వైద్య పరికరాలను తెచ్చిపెట్టారు. అందుకు సంబంధించిన వైద్య పరీక్షలను ల్యాబ్ టెక్నీషియన్లు నిర్వహిస్తే వాటిని మైక్రోబయోలజిస్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్తోపాటు కొన్ని పాత జిల్లా కేంద్రాలల్లోని హబ్లలో తప్ప ఎక్కడా మైక్రోబయోలజిస్టులు లేక ఈ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలాగే కేన్సర్ను నిర్ధారించేందుకు రూ. 50 లక్షల చొప్పున హబ్లలో ఏర్పాటు చేసిన సీరం–ఎలక్రో్టఫొరెసిస్ యంత్రాలకు అవసరమైన రీఏజెంట్లు (రసాయనాలు) అందుబాటులో లేక చాలా వరకు పరికరాలు వృథాగా పడి ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
కొన్ని టెస్టులతోనే సరి..
ప్రతి హబ్లో బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, పాథాలజీకి సంబంధించి 134 రకాల వైద్య పరీక్షలు జరగాల్సి ఉండగా చాలా హబ్లలో 30–40 టెస్టులు మాత్రమే జరుగుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ల కొరతతోపాటు రేడియాలజిస్టులు, మైక్రోబయోలజిస్టులు, ఇతర డాక్టర్లు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
హబ్లపై సన్నగిల్లుతున్న నమ్మకం
వివిధ హబ్లలో తరచూ పరీక్షల ఫలితాలు ఒకరివి మరొకరికి మారిపోతుండటంతో ప్రజల్లో తెలంగాణ డయాగ్నొస్టిక్స్పై విశ్వాసం సన్నగిల్లుతోంది. స్పోక్స్ (చిన్న కేంద్రాలు)లో బీపీ, షుగర్ మినహా అన్ని పరీక్షలను హబ్లకే పంపుతుండగా అక్కడ పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ఆ రిపోర్టులను తీసుకొస్తేనే పీహెచ్సీల్లో చూపించుకొనే పరిస్థితి ఉండటంతో గ్రామాల్లో చాలా మంది ఆర్ఎంపీల ద్వారా జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. పీహెచ్సీల్లో సమయానికి డాక్టర్లు ఉండకపోవడం కూడా రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడానికి కారణమవుతోంది. కాగా, ల్యాబ్ టెక్నీషియన్ల కొరత నేపథ్యంలో తాజాగా 700 మంది ల్యాబ్ టెక్నీషియన్లను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా..
⇒ ఖమ్మంలోని తెలంగాణ డయాగ్నొస్టిక్స్ హబ్లో రీ ఏజెంట్ల కొరతతో కేన్సర్కు సంబంధించి మూడొంతుల టెస్ట్లు జరగడం లేదు.
⇒ అక్కడ 134 రకాల పరీక్షలకుగాను 38 పరీక్షలే అందుబాటులో ఉన్నాయి. కొన్ని వైద్య పరికరాలు లేకపోవడమే అందుకు కారణం.
⇒జిల్లాలోని స్పోక్స్లలో రీ ఏజెంట్ల కొరతతో ఎక్కడా డయాగ్నస్టిక్ టెస్ట్లు నిర్వహించడం లేదు. శాంపిల్స్ సేకరించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని హబ్కు పంపుతున్నారు.
⇒ జనగామ జిల్లాలోని హబ్లో వైద్య పరికరాలు ఉన్నా టెక్నీషియన్లు, మైక్రోబయోలజిస్టులు అందుబాటులో లేక మైక్రోబయోలజీ సంబంధిత పరీక్షలు జరగడం లేదు.
⇒ పీహెచ్సీల నుంచి తీసుకున్న తాత్కాలిక సిబ్బందితోనే బయోకెమిస్ట్రీ ల్యాబ్లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. కేన్సర్కు సంబంధించి సీఏ 125, సీఈఏ, పీఎస్ఏ మూడు టెస్టులు ఇప్పటి వరకు 30 వరకు చేశారు.
⇒ ఈ హబ్లో 17 రకాల మిషన్లతో రోజుకు 1,659 పరీక్షలను చేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.
⇒ మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాగ్నస్టిక్ హబ్లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల కోసం పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని ఉంచేందుకు సరైన బిల్డింగ్ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.
⇒ నిర్మల్ జిల్లాలో మైక్రోబయాలజిస్టులు, పాథాలజిçస్టులు లేరు. కేన్సర్ టెస్టులు చేయడం లేదు. బయోకెమిస్ట్రీ, థైరాయిడ్, సీబీపీ, డెంగీ, థైరాయిడ్ టెస్టులను మాత్రం చేస్తున్నారు.
⇒ మంచిర్యాల టీ హబ్లోని మైక్రోబయోలజీ ల్యాబ్లో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టుల పరికరాలు ఉన్నా సిబ్బంది లేక దాన్ని వాడట్లేదు. అక్కడ మైక్రోబయోలజిస్ట్ మాత్రం ఉన్నారు. బయో కెమిస్ట్రీ ల్యాబ్లలో సీరం–ఎలక్ట్రోఫొరెసిస్ యంత్రాలు ఉన్నా సిబ్బంది లేరు. కేన్సర్ టెస్ట్కు ఉపయోగించే రీ ఏజంట్లు ఉన్నా.. టెస్టులు చేసే వారు లేరు. 134 రకాల పరీక్షలకుగాను 76 పరీక్షలు చేస్తున్నారు.
అన్ని రకాల పరీక్షలు జరుగుతున్నాయి
రాష్ట్రంలోని 32 హబ్స్, 1,546 స్పోక్స్లలో రోగులకు అన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. మైక్రోబయోలజీస్టులు లేనిచోట జిల్లా వైద్య కళాశాల అనుబంధ డీఎంఈ ఆసుపత్రుల సేవలను వినియోగించుకుంటున్నాం. సీరం–ఎలక్ట్రోఫోరెసిస్ పరీక్ష 5 జిల్లాల హబ్స్లో జరుపుతున్నాం. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయి. ప్రతి డయాగ్నస్టిక్ హబ్లో 10 నుంచి 20 మంది సిబ్బంది నమూనాలు తీసుకునేందుకు పనిచేస్తున్నారు. ఈ ఏడాది డీఎంఈ, టీవీవీపీ ఆసుపత్రుల నుంచి సిబ్బందిని తీసుకోవాలనుకుంటున్నాం. – ఆర్.వి. కర్ణన్, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ కమిషనర్