
ఎన్ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు
ఒకటి రెండు మినహా అన్నిచోట్లా సకల వసతులు
కొత్తగా చేపట్టిన చర్యలపై సవివరమైన నివేదిక
నేడు ఢిల్లీకి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి, డీఎంఈ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యార్థులకు క్లినికల్ ట్రైనింగ్ వంటి సౌకర్యాలను మెరుగుపర్చేందుకు చేపట్టిన చర్యలను జాతీయ వైద్యకమిషన్ (ఎన్ఎంసీ)కు తెలియజేయాలని రాష్ట్ర వైద్యాధి కారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కళాశాలలకుగాను 26 కళాశాలలు ‘మినిమం స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ (ఎంఎస్ఎంఈఆర్) – 2023’ నిబంధనలకు అనుగుణంగా లేవని ఎన్ఎంసీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ విషయంపై గత శుక్రవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగ్తూ, డీఎంఈ నరేంద్రకుమార్కు నోటీసులు జారీచేస్తూ బుధవారం ఢిల్లీలో విచారణకు రావాలని సూచించింది. 26 కళాశాలల ప్రిన్సిపా ల్స్, డీన్లు తమ కళాశాలల నుంచి వర్చువల్గా విచారణలో పాల్గొనాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో వైద్యాధికారులు అప్ర మత్తమయ్యారు. ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ఫ్రొఫె సర్లు ఎందరున్నారు? ఇంకెంత మంది అవసరం? కళాశాలల్లో విద్యార్థుల క్లినికల్ ట్రైనింగ్ ఎలా ఉంది? కొత్తగా కల్పించిన సౌకర్యాలు వంటి అంశాలపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించారు.
ఎన్ఎంసీ నిబంధనలు పాటించడం లేదని పేర్కొన్న 26 కళాశాలల్లో కొత్తగా ఏర్పాటైన 8 కళాశాలల్లో ములుగు, జనగాం వంటి కొన్ని చోట్ల మినహా మిగతా అన్ని చోట్ల మౌలిక వసతులు కల్పించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఎన్ఎంసీ అధికారులకు వివరించి, ఏ ఒక్క కళాశాలలో కూడా సీట్ల సంఖ్య తగ్గకుండా, అవసరమైన చోట్ల పెంచుకునేందుకు అవకాశం పొందేలా ఒప్పించాలని నిర్ణయించారు.
నోటీసులు రొటీన్ ప్రక్రియే: ఎన్ఎంసీ నోటీసు నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంఎస్ఎంఈఆర్ మార్గదర్శకాల విషయంలో ఏమాత్రం తేడా వచ్చి నా ఎన్ఎంసీ కొర్రీలు పెడుతుందని అధికారులు సీఎంకు వివరించారు. పశి్చమబెంగాల్లో ఉన్న మొత్తం 27 ప్రభుత్వ కళాశాలలు ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారని గుర్తుచేశారు. ఏపీలో మొత్తం 17, కర్ణాటకలో మొత్తం 22 కాలేజీలు, తమిళనాడులో 36కు 34 కాలేజీలు, యూపీలో 45 కాలేజీలకుగాను 24, కేరళలో 11కు 9 కళాశాలల్లో నిబంధనలు అమలు కాలేదని తేల్చి ఢిల్లీకి పిలిచినవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఏటా రొటీన్గా జరిగే ఈ కార్యక్రమం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల మినహా అంతటా మెరుగైన సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. 1,323 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను తీసుకోవడంతో పాటు ఇప్పటికే 1,500కు పైగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లలో అర్హులను బట్టి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించి ఎన్ఎంసీ నిబంధనల మేరకు నియామకాలు చేపట్టవచ్చని సీఎంకు వివరించినట్లు తెలిసింది.
జిల్లా, ఏరియా ఆస్పత్రులను బోధనా ఆస్పత్రులుగా మార్చిన నేపథ్యంలో వాటిని 300 పడకల ఆసుపత్రులుగా మార్చే ప్రక్రియ కూడా జరుగుతుందని సీఎంకు తెలిపినట్లు సమాచారం. బుధవారం వైద్య అదికారులు ఢిల్లీకి వెళ్లి ఈ వివరాలన్నీ ఎన్ఎంసీ అధికారులకు వివరిస్తారు. ఎన్ఎంసీ తనిఖీలు జరిపి వెళ్లిన ఆరునెలల్లో ఫ్యాకల్టీ, వసతులు మెరుగయ్యాయని డీఎంఈ నరేంద్ర కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలో ఎన్ఎంసీ తనిఖీలు సహజం: డీఎంఈ నరేంద్రకుమార్
విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు, మెడికల్ కాలేజీలలో ఎన్ఎంసీ తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం సహ జంగా జరిగే ప్రక్రియ అని వైద్య విద్య సంచాలకులు నరేంద్రకుమార్ తెలిపారు. గత 4 సంవత్సరాలుగా నోటీసులు వస్తూనే ఉన్నాయని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.
ఈ సంవత్సరం అనేక రాష్ట్రాల్లోని కాలేజీలకూ నోటీసులు వచ్చాయని, మన రాష్ట్రంలోని కాలేజీలకు మాత్రమే నోటీసులు వచ్చినట్టుగా, నోటీసులు రావడం ఇదే మొదటిసారి అన్న ట్టుగా అపోహలు సృష్టించి, తప్పుడు ప్రచారం చేయడం సరి కాదని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలకూ అను మతులు వస్తాయని, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.