సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైజై గణేశా అనే నినాదాలు మార్మోగుతున్నాయి. భక్తులంతా బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.విభిన్న రుపాలలో వినాయకున్ని ప్రతిష్టించి నవరాత్రులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ బేగంబజార్లో ఏకంగా 48 కిలోల ‘బంగారు గణేశుడిని ప్రతిష్టించారు. 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ బంగారు గణపతిని చూడడానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
వినాయక నవరాత్రుల్లో భాగంగా బేగంబజార్ ఫీల్ఖానాలో బంగారు గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్తో నైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో విగ్రహాన్ని రూపొందించారు. బంగారం, వజ్రాల ధగధగలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న గణనాథున్ని దర్శించుకొని భక్తులంతా తన్మయం చెందుతున్నారు.
ముంబయిలోని ప్రసిద్ధ లాల్బాగ్చా రాజా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రూపాలను స్ఫూర్తితో ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు దివ్య రూపాల మేళవింపుతో కొలువుదీరిన ఈ స్వర్ణ గణపతి భక్తులకు అరుదైన రీతిలో దర్శనమిస్తున్నాడు. దీంతో ఈ విగ్రహం నగరంలోనే అత్యంత ప్రత్యేకమైనదిగా ప్రాచుర్యం పొందుతోంది.
ఫీల్ఖానాకు చెందిన అనిల్ అగర్వాల్, ఆధార్ అగర్వాల్, నిఖితేష్ అగర్వాల్ అనే సోదరులు ఈ విగ్రహాన్ని తయారు చేయించారు. అక్కడ వారి దుకాణం వద్ద ఏర్పాటుచేసిన మండపంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మూడు అడుగుల ఎత్తు, 48 కిలోల బరువు ఉన్న ఈ విగ్రహాన్ని మొత్తం 8 మంది కళాకారులు తయారు చేశారు. 11 రోజుల పాటు గణేషుడు పూజలు అందుకోనున్నారు.
బేగంబజార్లో 48 కిలోల ‘బంగారు గణేశుడు’
వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఫీల్ఖానాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దివ్య మూర్తి
3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24K బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరణ
నైపుణ్యం కలిగిన కళాకారుల హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకున్న అరుదైన విగ్రహం… pic.twitter.com/ZwYU9zvGnE— RTV (@RTVnewsnetwork) September 14, 2026


