సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పీసీసీ ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉందని, ప్రజలకు గాంధీ భవన్ను మరింతగా దగ్గర చేయగలిగానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మా మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ‘కార్యకర్తలకు భరోసా, పార్టీకి బలాన్ని ఇవ్వగలిగాం. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం చేయగలిగాం. ఈ రెండేళ్లు సజావుగా సాగడానికి.. సీఎం రేవంత్ తో వేవ్ లెన్త్ మ్యాచయింది. సీఎం రేవంత్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిపూర్ణ సహకారం నాకు లభించింది. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేదే.. పీసీసీగా నాకు, సీఎం రేవంత్ లక్ష్యం. మంత్రులను గాంధీ భవన్లో.. ముఖాముఖి ఏర్పాటు చేసి ప్రజలకు మేలు చేయగలుగుతున్నాం. గాంధీ భవన్ వేదికగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తోడ్పాటు అందించడం పీసీసీగా సంతృప్తిని ఇచ్చింది.
తెలంగాణలో కుల సర్వే చేయడం.. పార్టీ అధినేతగా అత్యంత సంతృప్తి కలిగింది. కర్ణాటకలో మా పార్టీ ప్రభుత్వం ఉన్నా.. అక్కడ బీసీ సీఎం ఉన్నా.. కుల సర్వే చేయలేకపోయారు, కానీ తెలంగాణలో చేశాం. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచింది. ఏఐసీసీ ర్యాంకింగ్ లో తెలంగాణ నెంబర్ 1గా నిలిచింది. 6 నెలల కింద మూడో స్థానం లో ఉండేది. ఏఐసీసీ ఇచ్చే ప్రతీ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తున్నాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం రిజర్వేషన్ అనుకున్నాం. స్థానిక ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఇవ్వగలిగాం.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపిక కూడా అత్యంత పారదర్శకంగా సామజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చాం. రెండేళ్లలో వచ్చిన ఉప ఎన్నికల్లో విజయం సాధించాం. లోకల్ బాడీల్లో అత్యధిక మెజారిటీ స్థానాలు గెలిచాం. ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా జనం లోకి తీసుకెళ్లాం. వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవుల నియామకం భర్తీ చేయలేకపోయాం. కార్పొరేషన్ పదవులు సకాలంలో అందరికి ఇవ్వలేకపోయాం అనే బాధ ఉంది. కార్పొరేషన్ పదవులను సెప్టెంబర్ నెలాఖరు లోపు భర్తీ చేస్తాం.
ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో హైడ్రాకు బిగ్ షాక్!
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, నాకు మధ్య ఎక్కడా గ్యాప్ లేదు. మా ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ ఉంది. పార్టీ పరంగా మేము ఇచ్చే సలహాలు ప్రభుత్వం కూడా తీసుకుంది. బీసీ మంత్రిని తొలగించినప్పుడు బాధ ఉన్నా.. కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ ముఖ్యం. అందులో భాగంగా కొండా సురేఖపై నిర్ణయం తీసుకున్నామని’ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు.


