సాక్షి, హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కుమార్తె వెన్నెల స్పందించారు. పవన్ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు. తెలంగాణ గడ్డ ముమ్మాటికీ మా జాగీరే. పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం’’ అని వెన్నెల పేర్కొన్నారు.
‘‘ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారు’’ అని వెన్నెల అన్నారు.
ఆ రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?: కేటీఆర్
కాగా, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తెలంగాణ కచ్చితంగా భూమిపుత్రుల జాగీరే. పవన్ కల్యాణ్ను ఎవరు అడ్డుకున్నారు?. జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది?. 2023లో జనసేన పోటీ చేయలేదా? అని ప్రశ్నించారు. అలాగే, తెలంగాణ ఆవిర్భావం రోజే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది?. జాతీయ వాదంపై ప్రధాన మంత్రి మోదీని పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
తెలంగాణ, ఏపీ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు: పొన్నం
కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిన్న(మంగళవారం) పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ గురించి మాట్లాడే నైతిక హక్కు పవన్ కల్యాణ్కు లేదని, వెంటనే గద్దర్ ఆత్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
12 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ను పాకిస్తాన్లా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని హితవు పలికారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు.


