
అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్, వివిధ విభాగాల అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం బత్తిని కుటుంబం నగరంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉండడంతో వారికి సరిపడా తాగునీరు, వసతి, భోజనం, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు కల్పించేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ట్రాఫిక్, భద్రత వంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ చుట్టూ పది పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి రావడం కోసం ఆర్టీసీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ, చర్లపల్లి నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
చేప ప్రసాదం పంపిణీ కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. చేప పిల్లల ఖర్చును నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ భరించాలని సూచించారు. సమావేశంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, బత్తిని అమర్నాథ్ గౌడ్, గౌరీ శంకర్, చంద్రశేఖర్, శివశంకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. కాగా బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన సమావేశంలో బత్తిని కుటుంబ సభ్యులు జూన్ 8వ తేదీన చేప ప్రసాదానికి సర్వం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.