అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి  | Finance Department Orders to 21 Government Corporations | Sakshi
Sakshi News home page

అప్పులు, గ్యారంటీల వివరాలు పంపండి 

Apr 9 2024 1:45 AM | Updated on Apr 9 2024 3:18 PM

Finance Department Orders to 21 Government Corporations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివిధ కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ (ఎస్‌పీవీ) ద్వారా తీసుకున్న రుణాలు, చెల్లించాల్సిన వడ్డీలు, ఈ రుణాల కోసం ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల వివరాలను వెంటనే పంపాలని ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖలు రాశారు. ఆయా శాఖల పరిధిలో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లు, ఎస్‌పీవీల ద్వారా 2023– 24 నాటికి తీసుకున్న అన్ని రుణాలు, వాటికి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, 2024–25లో తీసుకోవాల్సిన రుణాలు, 2025 మార్చి 31 నాటికి వాటి ఖాతాల నిల్వల వివరాలను పంపాలని ఆ లేఖలో కోరారు.

ఆర్టీకల్‌ 293(3) ప్రకా రం ఈ వివరాలను కేంద్రానికి సమర్పించి అప్పులు తీసుకునేందుకు అనుమతి తీసుకోవాల్సి ఉన్నందున అత్యవసరంగా ఈ వివరాలను పంపాలని ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలో కోరారు. ఆర్థిక శాఖ వివరాలు కోరిన ఈ జాబితాలో డిస్కంలు, స్టేట్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, హౌసింగ్‌ కార్పొరేషన్, ఐటీఈఅండ్‌సీ, టీఎస్‌ఐఐసీ, జలమండలి, జీహెచ్‌ఎంసీ, మెట్రో రైల్, యూఎఫ్‌ఐడీసీ, టీడీడబ్ల్యూఎస్‌సీఎల్‌ (మిషన్‌ భగీరథ), రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్, ఆర్‌డీసీఎల్, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్, కాళేశ్వరం తదితర కార్పొరేషన్లు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement