
రెవెన్యూ సదస్సులో అధికారులపై రైతు ఆగ్రహం
చేయిపట్టి రైతును బయటకు లాక్కెళ్లిన ఏఎస్ఐ
ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు
ఖానాపూర్: ‘నా భూ సమస్యను పట్టించుకోరా..పదేళ్లకు పైగా తిరుగుతున్న. ఏదో ఒకటి ఇప్పుడే తేలిపోవాలి.. నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న అరెకరం భూమి నాకు ఇప్పించాలి. ఎన్నిసార్లు తిరగాలి. ఇప్పుడైనా న్యాయం చేస్తరా.. చేయరా.. ఎవరూ పట్టించు కుంటలేరు. ఎప్పుడు చేస్తరు.. మోకా మీద నేనే ఉన్నా కనిపించడం లేదా’అంటూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రైతు అల్లెపు వెంకటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
వివరాల్లోకి వెళితే... సదస్సులో భూ సమస్యపై రైతు వెంకటి కుమారుడు పీటర్ దరఖాస్తు అందజేసి వెళ్లారు. ఆ తర్వాత వెంకటి సదస్సుకు వస్తూ వస్తూనే పంచాయతీ కార్యదర్శి భోజన్నను భూ సమస్యపై ప్రశ్నించసాగాడు. దీంతో తహసీల్దార్ సుజాత జోక్యం చేసుకొని సమస్య ఏదైనా ఉంటే చెప్పాలని వారించే ప్రయత్నం చేశారు. అయినా రైతు వినిపించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ఆదేశించారు.
ఏఎస్ఐ రాంచందర్ ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. ‘నువ్వేం పోలీసువు’అంటూ ఆయన్ను ప్రశ్నించే ప్రయత్నం చేయగా బలవంతంగా బయటకు లాక్కెళ్లాడు. రైతు ప్రతిఘటించడం, ఏఎస్ఐ లాక్కెళ్లిన దృశ్యాలు వైరల్గా మారా యి. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బా సర డీఐజీ ఏఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఇదీ భూ సమస్య నేపథ్యం..
అల్లెపు వెంకటికి మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఓ వ్యక్తికి 14 ఏళ్ల క్రితం ఎకరం భూమిని విక్రయించాడు. అయితే ఆయన ఎకరన్నర భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఆలస్యంగా గుర్తించిన వెంకటితోపాటు కుటుంబ సభ్యులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.
రెండెకరాల్లో తానే ఉన్నానని, అర ఎకరం భూమి తనకే వచ్చేలా చూడాలని కోరుతున్నాడు. కాగా, ‘వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా.. మీరు చెబుతున్న ప్రజాపాలన ఇదేనా’అంటూ మాజీమంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.