TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్‌ వీడియో వైరల్‌ | Fake video on Gandhi hospital complaint to police | Sakshi
Sakshi News home page

TS: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఫేక్‌ వీడియో వైరల్‌

May 21 2024 12:10 PM | Updated on May 21 2024 1:00 PM

Fake video on Gandhi hospital complaint to police

గాంధీ ఆస్పత్రిలో కరెంట్‌ లేక బాలుడు మృతి చెందాడని కథనం 

విచారణ చేపట్టిన సీఎం పేషీ.. తప్పుడు కథనమని తేలిన వైనం 

పోలీసులకు ఫిర్యాదు చేసిన గాంధీ సూపరింటెండెంట్‌ 

గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ‘ఎక్స్‌’ఖాతాలో ఓ ఫేక్‌ వీడియో వైరల్‌ అయింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో కొవ్వొత్తులు, టార్చిలైట్లు, సెల్‌ఫోన్‌ వెలుగులో వైద్యసేవలు అందించారని, ఈ క్రమంలో ఓ బాలుడు మృతి చెందాడని, గొప్పులు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు దరిద్రంగా ఉందని, గుంపు మేస్త్రీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ వీడియోను పెట్టారు. 

ఓ తెలుగు చానల్‌ లోగోతో ఉన్న వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ ‘బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ’ఎక్స్‌ ఖాతాలో ఇది పోస్ట్‌ అయింది. దీనిపై సీఎం కార్యాలయం విచారణ చేపట్టగా అంతా ఉత్తదే అని తేలింది. పాత క్లిప్పింగ్‌తో డీప్‌ఫేక్‌ ద్వారా తప్పుడు వీడియోను సృష్టించారని విచా రణలో వెల్లడైంది. 

సీఎం పేషీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు చిలకలగూడ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీ సులు దర్యాప్తు చేపట్టారు. బీఆర్‌ఎస్‌ యూఎస్‌ఏ ఎక్స్‌ ఖాతాలో హరీశ్‌రెడ్డి అనే వ్యక్తి ఈ ఫేక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. ఐటీ, ఐపీసీ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఎస్‌హెచ్‌ఓ అనుదీప్‌ తెలిపారు. వైద్యులు, సిబ్బందిపై నిందలు వే యడం తగదని గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement