విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత? | Education Department decides to examine academic abilities | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో జిజ్ఞాస ఎంత?

Jun 25 2025 4:10 AM | Updated on Jun 25 2025 4:10 AM

Education Department decides to examine academic abilities

విద్యాసామర్థ్యాల పరిశీలనకు విద్యాశాఖ నిర్ణయం 

చదవడం, రాయడంపై రాత, మౌఖిక పరీక్షలు 

1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఏటామూడుసార్లు ప్రత్యేక పరీక్ష... ప్రభుత్వ స్కూళ్లకుఎస్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలు

సాక్షి, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థుల పఠనాసక్తి, వారిలోని సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రత్యేక పరీక్షలు చేపట్టనున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేసింది. దీన్ని బేస్‌లైన్‌ టెస్ట్‌గా చెబుతున్నారు. పరీక్ష నిర్వహణ, విద్యా సామర్థ్యాల పరిశీలనకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్‌సీఈఆర్‌టీ మంగళవారం జిల్లా అధికారులకు పంపింది. 

ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వీటిని నిర్వహిస్తారు. సంవత్సరానికి మూడుసార్లు జరిగే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులను పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను తయారు చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఒకసారి, మధ్యలో మరోసారి, చివరలో ఇంకోసారి పరీక్షలు ఉంటాయి. రెగ్యులర్‌గా జరిగే పరీక్షలకు ఇవి భిన్నంగా ఉంటాయనిఅధికారులు తెలిపారు. 

పాఠశాలహెచ్‌ఎంలు ప్రతీ విద్యార్థికి సంబంధించిన మార్కులను యాప్‌లో పొందుపరుస్తారు. వీటి ఆధారంగా విద్యార్థి ఎక్కడ వెనుకబడి ఉన్నాడు? ఏ జిల్లాల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అనే వివరాలను ఎస్‌సీఈఆర్‌టీ పరిశీలించి, విద్యార్థుల స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది.

పరీక్ష విధానం ఇదీ.. 
ఈ ప్రక్రియ మొత్తం ఎస్‌సీఈఆర్‌టీ నేతృత్వంలోనే నడుస్తుంది. ప్రశ్నపత్రాల రూపకల్పన, వాటి పరిశీలన ఈ విభాగమే చూస్తుంది. ఇది తరగతి వారీగా మారుతుందని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో అనర్గళంగా చదవడం, రాయడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం తప్పనిసరి. దీని ఆధారంగానే పరీక్ష నిర్వహిస్తారు. పిల్లలు సరళ పదాలు, గుణింతాలు ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలను చదవాలి. 

తెలుగు పదాలను తడబడకుండా, తప్పులు లేకుండా నిర్ణీత వేగంతో చదివితేనే ఆ విద్యార్థికి సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తిస్తారు. గణితంలో 1, 2 తరగతుల విద్యార్థుల సంఖ్యలు గుర్తించడం కూడికలు, తీసివేతలు సమస్యల సాధన, 3, 4, 5 విద్యార్థులు కూడికలు, తీసివేతలు, భాగహారం వంటివి చేయాలి. 6–10వ తరగతి వారికి పాఠ్యాంశాల్లో కనీస ప్రశ్నలు వస్తాయి. 

ఇందులో విద్యార్థి ఎంత వేగంతో సమాధానం ఇస్తున్నాడు? ఇచ్చేదాంట్లో సరైన సమాధానం శాతం ఎంతమేర ఉందనే దాన్ని సామర్థ్యానికి కొలమానంగా తీసుకుంటారు. 9, 10 తరతుల విద్యార్థులను కొంత తికమక పెట్టే రీతిలోనూ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు, సంవత్సరంలో నిర్వహించే పరీక్షలకు ఏ సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement