
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రతతో సోమవారం సాయంత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భూమి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
కొడిమ్యాలలో ఆరు సెకన్లపాటు.. పెద్దపల్లి నియోజకవర్గంలో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. అటు నిర్మల్ జిల్లాలోనూ భూప్రకంపనలు సృష్టించాయి. ఖానాపూర్, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలో ప్రకంపనలు ప్రజల్ని ఆందోళనకు గురి చేశాయి. భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీశారు.
మరోవైపు, మేడిపల్లి మండలంలో భూ ప్రకంపనలతో పల్లె అర్జున్ అనే రైతు ఇల్లు కూలింది. ఇల్లు కూలే సమయంలో ఇంట్లో ఉన్న అర్జున్ కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.