
హైదరాబాద్: రైలు పట్టాలపై కారు నడిపిన కేసులో నిందితురాలైన వోమికా సోనీని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఆమె మానసిక స్థితి బాగోలేనందున తొలుత చికిత్స తీసుకోవాలని, అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు పర్చాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు సూచించారు.
2025 జూన్ 26న(గురువారం) శంకర్పల్లి (రంగారెడ్డి జిల్లా) నాగులపల్లి వద్ద ఓ మహిళ రైలు పట్టాలపై కారు నడిపి హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల ప్రాంతంలో సుమారు 8 కిలోమీటర్లపాటు ఆమె అలా పట్టాలపై కారు పోనిచ్చింది. అది గమనించిన స్థానికులు, రైల్వే పోలీసులు ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో రాడ్తో ఆమె అందరిపై దాడికి యత్నించింది. చివరకు ఓ చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోగా.. ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన ఫలితంగా 45 నిమిషాల పాటు రైలు సేవలు నిలిచిపోయాయి. బెంగళూరు-హైదరాబాద్ మధ్య నడిచే 15 రైలు దారి మళ్లించారు. ఘటనకుగానూ ఆమెపై పోలీసులు, రైల్వే పోలీసులు విడివిడిగా కేసు నమోదు చేశారు. తొలుత మద్యం మత్తులో ఆ మహిళ అలా చేసి ఉండొచ్చని పోలీసుల భావించారు. అయితే..
ఆమె పేరు వోమికా సోని(34) అని, లక్నో(యూపీ)కి చెందిన మహిళ అని తర్వాత నిర్ధారించుకున్నారు. ఐటీ జాబ్ పొగొట్టుకున్న ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందని.. ఆపై తన కియా కారుతో ఇలా పట్టాలపై బీభత్సం సృష్టించిందని పోలీసులు తేల్చారు. చివరకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్నాక.. ఆమెపై చర్యల అంశాన్ని పోలీసులు పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
Video: Woman Drives Car On Railway Track, Disrupts Train Services pic.twitter.com/5MSyXJXzbG
— NDTV (@ndtv) June 26, 2025