రిజిస్ట్రార్‌ గదికి తాళం.. తెయూలో వివాదం 

Dispute over the post of Registrar in Telangana University - Sakshi

ఉన్నత విద్యాశాఖ, కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్ యాదగిరి 

తాళం వేయించలేదంటున్న వీసీ..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ పదవి విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. సోమవారం రిజిస్ట్రార్ యాదగిరి గదికి తాళం వేసి ఉంచడంతో గందరగోళం నెలకొంది. దీనిపై రిజిస్ట్రార్ యాదగిరి ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌కు ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో ఉదయం అన్ని విభాగాలు, చాంబర్లకు సెక్యూరిటీ సిబ్బంది తాళాలు తెరిచారు. రిజిస్ట్రార్ చాంబర్‌ మాత్రం తెరవద్దని వైస్‌ చాన్స్‌లర్‌ పీఏ సవిత చెప్పడంతో తెరవకుండానే ఉంచారు. అక్కడకు వచ్చి న రిజిస్ట్రార్ విషయాన్ని పాలకమండలి సభ్యులకు చెప్పడంతో వారు వీసీకి ఫోన్‌ చేశారు. దీంతో మధ్యాహ్నం 1.30 గంటలకు తాళం తీయడంతో సిబ్బంది వెళ్లి కూర్చున్నారు. రిజిస్ట్రార్ మాత్రం చాంబర్‌కు రాలేదు. 

ప్రభుత్వం చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చా.. 
ప్రభుత్వం, పాలకమండలి చెబితేనే రిస్ట్రాస్టార్‌గా వచ్చానని, సమస్య పరిష్కారం చేస్తేనే బాధ్యతలు స్వీకరిస్తానని యాదగిరి ‘సాక్షి’కి తెలిపారు. తనను లొంగదీసుకునే ఉద్దేశంతోనే వీసీ ఇలా చేశారని ఆరోపించారు. కాగా తాళం వేసిన విషయమై వీసీ రవీందర్‌గుప్తాను ‘సాక్షి’ప్రశ్నించగా, తాను తాళం వేయించలేదని, అలా చేస్తే తాళానికి సీల్‌ వేసి, లెటర్‌ విడుదల చేసేవాడినన్నారు.

వీసీ గా ఉన్న తన అనుమతి లేకుండానే ఈసీ సభ్యులు యాదగిరిని రిజిస్ట్రార్‌గా నియమించ డం చెల్లదన్నారు. తాను రిజిస్ట్రార్‌గా పెట్టిన విద్యావర్థినిని బయటకు పంపి యాదగిరిని ఎలా నియమిస్తారన్నారు. తెయూలోనూ ఇతర ప్రొఫె సర్లు ఉన్నప్పటికీ తనకు నచ్చని యాదగిరిని నియమించారని, తాను ఆర్డర్‌ ఇవ్వకుండా యాదగిరి ఎలా బాధ్యతలు తీసుకుంటారని వీసీ అన్నారు.  

తెయూ వీసీని సస్పెండ్‌ చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు 
తెయూ వీసీపై వచ్చి న ఆరోపణలపై విచారణ కమిషన్‌ లేదా రిటైర్డ్‌ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ నేత దినేశ్‌ కులాచారితో పాటు పలువురు వర్సిటీ విద్యార్థులు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత వీసీ 2021మేలో పదవి చేపట్టాక  పరిపాలన, ఆర్థిక వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సోమ వారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైకి వినతిపత్రం సమర్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top