ఈ స్కోరు.. పిల్లలకు జరూరు! | Dietary diversity score can be used to assess nutritional deficiencies | Sakshi
Sakshi News home page

ఈ స్కోరు.. పిల్లలకు జరూరు!

Jul 3 2026 3:08 AM | Updated on Jul 3 2026 3:08 AM

Dietary diversity score can be used to assess nutritional deficiencies

డైటరీ డైవర్సిటీ స్కోర్‌తోపోషకాహార లోపాన్ని అంచనా వేయొచ్చు 

ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: బడి వయసు పిల్లల్లో (6–10 ఏళ్లు) సూక్ష్మ పోషకాల లోపాలను సులభంగా గుర్తించేందుకు హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌–నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు ఒక వినూత్న స్క్రీనింగ్‌ పద్ధతిని రూ పొందించారు. దీనికి ‘డైట్‌ డైవర్సిటీ స్కోర్‌’అని పేరు పెట్టారు. వీరు ఆహార పదార్థాలను 13 రకాలుగా వర్గీకరించారు. ఒక రోజులో ఆ చిన్నారి తీసుకునే విభిన్న ఆహార పదార్థాలనుబట్టి ఈ స్కోర్‌ ఆధారపడి ఉంటుంది. స్కోర్‌ ఎంత ఎక్కువగా ఉంటే అంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకున్నట్టు.  

13 రకాల ఆహారాలతో.. 
భారత్‌ వంటి మధ్య ఆదాయ దేశాలలో పిల్లల్లో ఐరన్, క్యాల్షియం, విటమిన్‌ బి–12, విటమిన్‌–ఏ వంటి సూక్ష్మపోషకాల లోపం పెద్ద సవాలుగా మారింది. ఇది పిల్లల పెరుగుదల, రోగనిరోధక శక్తి, చదువుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనిని నివారించడానికి పరిశోధకులు సాధారణ ఆహారాలను వాటిలోని పోషక విలువల ఆధారంగా 13 నిర్దిష్ట సమూహాలుగా వర్గీకరించారు. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి విస్తృత ఆహార సమూహాలను సాధారణంగా ఉపయోగించినప్పటికీ, పోషకాల ప్రొఫైల్స్‌లోని వ్యత్యాసాలను మెరుగ్గా గుర్తించడానికి పరిశోధకులు ఈ సమూహాలను మరింత ఉప–విభాగాలుగా విభజించారు. ఉదాహరణకు విటమిన్‌ ‘ఎ’ఎక్కువగా ఉండే క్యారెట్, క్యాప్సికమ్, తోటకూర, బొప్పాయి, మామిడి వంటి వాటిని ప్రత్యేక కేటగిరీగా చూపారు.  

5 గ్రాముల కనీస కొలత 
భారతీయ ఆహార అలవాట్లలో కూరలు, పప్పులు కలిపి తీసుకుంటుంటారు. అందుకే కేవలం 5 గ్రాముల పరిమాణంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకుంటే చాలు. స్కోరును లెక్కించవచ్చు. పరిశోధన ప్రకారం.. 24 గంటల్లో చిన్నారి తీసుకునే పాలు, పాల ఉత్పత్తులు; పండ్లు, గింజలు, కొవ్వులు, గుడ్లు, మాంసం, తృణధాన్యాలు, చిరుధాన్యాలు; పప్పులు, ఆకుకూరలు, కందమూలాలు, కూరగాయల ఆధారంగా స్కోర్‌ను లెక్కించొచ్చు. 13 ఆహార సమూహాల్లో కనీసం 10 గ్రూపుల ఆహారాన్ని (ప్రతీది కనీసం 5 గ్రాములు) రోజూ తీసుకునే పిల్లలు తమకు కావలసిన 70 శాతం సూక్ష్మపోషకాలను సులభంగా పొందగలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది వారిలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచడానికి కూడా దోహదపడుతోంది.  

అందరికీ ఉపయోగకరం.. 
ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త డా. సుబ్బారావు ఎమ్‌.గవరవరపు మాట్లాడుతూ ‘తినే విభిన్న ఆహార పదార్థాలనుబట్టి ఎంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నామని లెక్కించడం అత్యంత ప్రాచీన, ఆచరణాత్మకమైన సూచికల్లో ఒకటి. సంక్లిష్టంగా ఉండే ఆహార గణన ప్రక్రియను సులభంగా ఉపయోగించగల స్కోరింగ్‌ను సాధన రూపంలోకి మార్చడం ద్వారా.. పిల్లల్లో సూక్ష్మపోషకాల లోపముప్పును ముందే గుర్తించడానికి, వారికి సకాలంలో సరైన పోషకాహారాన్ని అందించడానికి ఈ విధానం దోహదపడుతుంది’అని తెలిపారు. పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలు, ఐసీడీఎస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పోషకాహార నిపుణులకు ఈ స్కోరింగ్‌ విధానం ఉపయోగపడుతుందని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భారతి కులకర్ణి పేర్కొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement