రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి | Deputy Tehsildar died in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి

Dec 29 2022 8:09 AM | Updated on Dec 29 2022 3:48 PM

Deputy Tehsildar died in Road Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దార్‌ మృతి చెందారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడకు చెందిన కొమ్మిశెట్టి బాలకృష్ణ (47) ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కారులో షిరిడీకి వెళ్లారు. దైవ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం కర్ణాటకలోని బసవ కల్యాణి ప్రాంతానికి చేరుకున్నారు.

తెల్లవారుజామున రోడ్డుపై ప్రమాదం జరగడంతో బాలకృష్ణ కారును ఆపారు. ఇంతలో టైర్ల లోడుతో వస్తున్న లారీ డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టింది. లారీలోని టైర్లు కారుపై పడ్డాయి. దీంతో బాలకృష్ణ ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందారు. భార్య విజయ, కొడుకు భార్గవ్, కూతురు శ్రీజ, తోడల్లుడి కొడుకు, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, యాచారం, కందుకూరు, జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో ఆయన పని చేశారు.

బాలకృష్ణ మృతిపై రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం తమతో కలివిడిగా ఉంటూ సందడి చేసే బాలకృష్ణ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధగా ఉందన్నారు. అలాగే.. బాలకృష్ణ మృతితో ఆయన స్వగ్రామం అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొహెడలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాకులు క్యామ మల్లేష్‌ సంతాపం తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement