
జిల్లా నుంచి మంత్రి పదవి ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలు
మొదటి నుంచి మంత్రి పదవి వస్తుందనుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
లంబాడా కోటాలో మంత్రి పదవి అడిగిన బాలునాయక్
వీరిద్దరికీ పదవులు ఇవ్వని కాంగ్రెస్ అధిష్టానం
మరోసారి విస్తరణలోనైనా అవకాశం దక్కేనా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచన చేయడంతో జిల్లాకు పక్కా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆదివారం ప్రకటించిన మంత్రివర్గంలో జిల్లా నేతలకు చోటు దక్కకపోవడంతో ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయితే మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా? అవకాశం దక్కుతుందా? ముఖ్యంగా ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అవకాశం ఇస్తారా? అన్న దానిపై జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.
రాజగోపాల్రెడ్డికి మంత్రి వర్గంలో దక్కని చోటు
ఈసారి మంత్రి వర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చోటు దక్కలేదు. ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినందునే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చర్చ జరిగింది. అయితే మొదటి మంత్రివర్గంలో రాజగోపాల్రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి చోటు దక్కడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపకపోవడంతో రాజగోపాల్రెడ్డికి అప్పట్లో చోటు దక్కలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం రాజగోపాల్రెడ్డితో మాట్లాడి భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అన్నీ తానై ఆ బాధ్యతను భుజాన వేసుకుని భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది.
వాయిదా పడుతూ విస్తరణ..
పార్లమెంట్ ఎన్నికల నాటినుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ వార్తలు వెలువడినా.. రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన అలకవహించినట్లు చర్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆదివారం రాత్రి వరకు వారికి అందుబాటులోకి రాలేదు.
బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్
ఇస్తారని మొన్నటి వరకు చర్చ మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లంబాడా కోటాలో మంత్రి పదవిని ఇవ్వాలని గతంలోనే అధిష్టానాన్ని అడిగారు. ఆ దిశగా అధిష్టానం కూడా మొగ్గు చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి ఉన్నందున, మరో రెండు మంత్రి పదవులు ఇస్తే ఇతర సమస్యలు వస్తాయన్న ఆలోచనతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, బాలునాయక్కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని అసెంబ్లీ సమావేశాల సమయంలో జోరుగా చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా బెర్తు దక్కలేదు.
చర్చనీయాంశంగా మారిన జానా లేఖ
రెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో రాజగోపాల్రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆ చర్చ సద్దుమణిగినా ప్రస్తుతం విస్తరణలో రాజగోపాల్రెడ్డికి, బాలునాయక్కు పదవులు దక్కలేదు.