నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన | Cyberabad police solve one month old infant kidnapping case | Sakshi
Sakshi News home page

నెల రోజుల పసికందు కిడ్నాప్‌​ కేసు.. 72 గంటల్లో ఛేదన

Jul 3 2026 3:20 PM | Updated on Jul 3 2026 3:46 PM

Cyberabad police solve one month old infant kidnapping case

హైదరాబాద్‌ : నెలరోజుల పసికందు కిడ్నాప్ కేసునుసైబరాబాద్ చందానగర్ పోలీసులు 72గంటల్లో ఛేదించారు. ఈ సందర్భంగా శుక్రవారం సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి రమేష్ రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

గత నెల 30వ తేదీ అర్థరాత్రి అనంతరం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిద్రిస్తున్న మహిళ వద్ద నుంచి నెల రోజుల వయస్సు గల ఆడశిశువును కిడ్నాప్ చేసిన ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.. 
ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన చిన్నారులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే క్రమంలో ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని కేవలం 72 గంటల్లోనే కేసును ఛేదించి పాపను సురక్షితంగా రక్షించారు.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన సాధిక మక్సూద్ అనే మహిళకు సంతానం లేకపోవడంతో పాపను అక్రమంగా తెప్పించుకునేందుకు కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  ‘ఆమె బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న నిమ్మి జహాన్, రహనుమా అలీల సహాయం కోరింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై నిద్రిస్తున్న కర్ణాటక కు చెందిన కుటుంబం వద్ద నుంచి పసికందును ఎత్తుకెళ్లి ఆటోలో ఎత్తుకెళ్లారు. ఈ శిశువును తీసుకురావడానికి కిడ్నాపర్లకు సాధిక మక్సూద్ రూ.1.50 లక్షలు చెల్లించినట్లు విచారణలో తేలింది.  అనంతరం పాపతో కలిసి కోల్‌కతాకు వెళ్లేందుకు రైల్వే టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ, వేగంగా స్పందించి వారిని అదుపులోకి తీసుకుని పాపను రక్షించాం’ అని తెలిపారు.

ఈ కేసులో ఏ1 మొహమ్మద్ జుబెర్, ఏ2 మొహమ్మద్ ఇర్ఫాన్, ఏ3 సాధిక మక్సూద్, ఏ4 నిమ్మి జహాన్, ఏ5 రహనుమా అలీలను అరెస్ట్ చేసామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ క్రైమ్స్ శ్రీనివాస్, ఆర్ సి పురం ఏసీబీ వై శ్రీనివాస్ రావు, చందానగర్ సిఐ విజయ్ కుమార్, అమీన్పూర్ డిఐ భాస్కర్ తో పాటు పలువురు  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement