
ఆశావహులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పెద్దలు
కేబినెట్లో చోటు దక్కని సుదర్శన్రెడ్డి, ప్రేమ్సాగర్రావుల నివాసాలకు మీనాక్షి, మహేశ్గౌడ్
రాజగోపాల్రెడ్డిని కలిసేందుకు యత్నాలు.. అందుబాటులోకి రాని నల్లగొండ ఫైర్ బ్రాండ్
42శాతం జనాభా ఉన్న జిల్లాలకు అవకాశం ఇవ్వకపోతే ఎలా?: మల్రెడ్డి ఆవేదన
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని నేతల్లో పార్టీ పట్ల అసంతృప్తికి తావివ్వకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఇన్చార్జ్ సెక్రటరీలు విశ్వనాథన్, విష్ణునాథ్ సహా రాష్ట్ర నేతలకు సూచనలు చేసింది. అసంతృప్త నేతలతో నేరుగా మాట్లాడాలని చెప్పింది. ఈ మేరకు ఆదివారం మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడి కీలక సూచనలు చేశారు. భవిష్యత్లో కచ్చితంగా అవకాశాలు దక్కుతాయనే భరోసా ఇవ్వాలని సూచించారు. అవసరమైతే అసంతృప్త నేతలను ఢిల్లీకి తీసుకురావాలని సైతం సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో అసంతృప్తులు చల్లారే వరకు ఇన్చార్జ్తో సహా సెక్రటరీలు హైదరాబాద్లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
దీంతో మంత్రి పదవి ఆశించి..విస్తరణలో చోటు దక్కని నేతలను బుజ్జగించే పని ఆదివారం ఉదయమే ప్రారంభమైంది. కేబినెట్లో చోటు దక్కిన వారి పేర్లు బయటకు వచ్చిన అరగంటలోపే టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్గౌడ్ అప్రమత్తమయ్యారు. అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ను తీసుకొని ఆయన ముఖ్య నేతల ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించారు. నిజామాబాద్ సీనియర్ నేత పి.సుదర్శన్రెడ్డి, ఆదిలాబాద్కు చెందిన ప్రేమ్సాగర్రావు, రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డిలను వారి నివాసాలకు వెళ్లి కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక సమీకరణల నేపథ్యంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, భవిష్యత్లో వచ్చే అవకాశాల్లో కచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
⇒ సుదర్శన్రెడ్డితో అర గంటకుపైగా మీనాక్షి, మహేశ్గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఎంపీ అనిల్కుమార్యాదవ్లు కలిసి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆవేదనను సుదర్శన్రెడ్డి వెలిబుచ్చగా, మరోమారు తప్పకుండా అవకాశం ఇస్తామని మీనాక్షి చెప్పినట్టు తెలిసింది.
⇒ ఆ తర్వాత ప్రేమ్సాగర్రావు నివాసంలో మీనాక్షి, మహేశ్గౌడ్లు గంటకు పైగా చర్చలు జరిపారు. గత కొన్ని దశాబ్దాలుగా పారీ్టకి తాను చేస్తున్న సేవలను వివరించిన ప్రేమ్సాగర్రావు.. అకారణంగా తనను పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.
⇒ రంగారెడ్డి జిల్లా నేత మల్రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణలే కారణమయితే తాను రాజీనామా చేస్తానని, తన స్థానంలో ఎవరినైనా గెలిపించి వారికైనా మంత్రిపదవి ఇవ్వా లని కోరినట్టు సమాచారం. రాష్ట్రంలోనే 42 శాతం జనాభా కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలాకు మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడాన్ని మల్రెడ్డి ప్రశి్నంచారు. గతంలో అరుగురు మంత్రులు ఈ జిల్లాల్లో పనిచేసినట్లు వెల్లడించారు. ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పడొచ్చని మల్రెడ్డి వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వారంలోనే కార్యవర్గం
మంత్రివర్గ విస్తరణ కొలిక్కి వచ్చినందున టీపీసీసీ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 35 మంది వైస్ ప్రెసిడెంట్లు, 75 మంది ప్రధాన కార్యదర్శులతో కార్యవర్గాన్ని మొదట ప్రకటించి, తర్వాత జిల్లాల అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తారు.
దొరకని రాజగోపాల్
సుదర్శన్రెడ్డితో బుజ్జగింపుల అనంతరం నేరుగా రాజ గోపాల్రెడ్డి ఇంటికి వెళ్లాలని మీనాక్షి, మహేశ్గౌడ్లు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఇద్దరు నేతలు ఆ తర్వాత కూడా రాజగోపాల్ అందుబాటులోకి రాకపోవడంతో ప్రేమ్సాగర్రావు ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి రాజగోపాల్ ఇంటికి వెళ్దామనుకున్నా రాత్రి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.