‘తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ పది శాతం జీతం కట్ చేస్తా’ | CM Revanth Speech At Group 1 Documents Distribution Programme | Sakshi
Sakshi News home page

‘తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మీ పది శాతం జీతం కట్ చేస్తా’

Sep 27 2025 8:09 PM | Updated on Sep 27 2025 8:30 PM

CM Revanth Speech At Group 1 Documents Distribution Programme

హైదరాబాద్: తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామని గ్రూప్‌-1 అభ్యర్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ రోజు(శనివారం, సెప్టెంబర్‌ 27) శిల్పకళా వేదికలో గ్రూప్‌-1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఏం రేవంత్‌ మాట్లాడారు.  ‘మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దాం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. ెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు మీరు సహకారం అందించాలి. 

ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్. మీరు, మేము కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం.  మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తాం’ అని సీఎం రేవంత్‌ హెచ్చరించారు. 

‘కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు.. తెలంగాణ ఎక్కడున్నది.. ఎక్కడ ఉంటది అని. వారికి నేను ఒక్కటే చెబుతున్నా…తెలంగాణ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం… ఇది తెలంగాణ భవిష్యత్. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయి. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయి. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుంది. కానీ కొంత మంది కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారు. తెలంగాణ ప్రజలు వారికి నమ్మి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకద్రోహం చేశారునమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. 

పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం. ఒక యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించారు.  ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయి. అందుకే మేం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. పరీక్షలు నిర్వహించాం.. ఇది కొంతమందికి నచ్చలేదు. కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో మీకు తెలుసు. 

కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించిండ్రు. అయినా మీ భవిష్యత్ కోసం కొట్లాడినం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగాం. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు నాకు మీ భవిష్యత్ మాత్రమే కనిపించింది. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది.  నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి.. ఒక బాధ్యతతో వ్యవహరించండి’ అని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement