
సాక్షి, హైదరాబాద్: ప్రజాపాలన సాగిన తీరు, వచ్చిన దరఖాస్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఇది అధికారిక మంత్రివర్గ భేటీ కాదని, అందుబాటులో ఉన్న మంత్రులు దీనికి హాజరుకావాలని కోరినట్లు సమాచారం. కాగా ప్రజాపాలనలో ఎక్కువగా దరఖాస్తులు దేని కోసం వచ్చాయి? వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి.? అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాలపై చర్చిస్తారని తెలిసింది. ప్రభుత్వం ఊహించిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు ప్రజాపాలనలో పాల్గొని దరఖాస్తులు సమర్పించిన నేపథ్యంలో వాటి కంప్యూటరీకరణ, దరఖాస్తుల పరిష్కారానికి అవసరమైన నిధులు, వాటి సమీకరణ తదితర అంశాలను చర్చించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
చేయూత పథకం కింద పింఛన్ను రూ.4,000కు పెంచడం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు భరోసా కార్యక్రమాలపై సమీక్షించనున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే ఆరోపణలు, ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుల్లో అవకతవకలకు సంబంధించి న్యాయ విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం తదితరాలపై కూడా చర్చించనున్నట్లు చెబుతున్నారు. ఇక నెలరోజుల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నెలరోజుల పాలన, అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మరింత ఘాటుగా స్పందించడానికి ఏమి చేయాలన్న అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
1.11 కోట్ల కుటుంబాల నుంచి దరఖాస్తులు
గతనెల 28వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు 8 పనిదినాల్లో కొనసాగిన ప్రజాపాలనలో మొత్తం 1.11 కోట్ల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వారి ద్వారా 1,25,84,383 దరఖాస్తులు అందినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 12,769 గ్రామ పంచాయతీలతో పాటు, 3,623 మునిసిపల్ వార్డులు/డివిజన్లలో ఈ ప్రజాపాలన నిర్వహించినట్లు పేర్కొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తంలోని ఆరు గ్యారంటీల కింద మొత్తం 1,05,91,636 దరఖాస్తులు రాగా.. ఇతర అంశాలకు సంబంధించి 19,92,747 అందాయి.