
ఆరుసార్లు వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు..
ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో 72.83 ఎల్ఎంటీ ధాన్యం సేకరణ
అదనంగా లక్ష టార్పాలిన్లతో అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడాం
నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నాం.. 90 శాతానికిపైగా సద్వినియోగం అవుతోంది
డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ. 3,800 కోట్లు వసూలు.. మరో రూ. 1,400 కోట్లు రావాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ను ఈ నెలలోనే పొందుతున్న రేషన్కార్డుదారులు మూడుసార్లు, ఆరుసార్లు వేలిముద్రలు వేసే అవసరం లేకుండా సాఫ్ట్వేర్ను సరిచేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. కేంద్రం జారీ చేసిన ఎన్ఎఫ్ఎస్ కార్డులకు ఆరుసార్లు.. రాష్ట్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఎస్ కార్డులకు మూడుసార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో జరుగుతున్న జాప్యాన్ని గుర్తించి సరిచేసినట్లు తెలిపారు.
ఇప్పుడు వినియోగదారులు ఒకసారి వేలిముద్ర వేస్తే సరిపోతుందన్నారు. అయితే మూడు నెలల రేషన్ కాబట్టి బియ్యాన్ని రెండు, మూడుసార్లు తూకం వేయాల్సి వస్తుందని ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
మరో వారంలో ధాన్యం సేకరణ పూర్తి
ముందస్తు నైరుతి రుతుపవనాలు, అకాల వర్షాలు ముంచెత్తినా, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేశాం. సోమవారం నాటికి ఏకంగా 72.83 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని సేకరించాం.
చాలా జిల్లాల్లో ఇప్పటికే ధాన్యం సేకరణ పూర్తయింది. మరో వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తాం. ఆలస్యంగా నాట్లేసిన మండలాల్లో ఒక్కో కేంద్రాన్ని అందుబాటులో ఉంచుతాం. రైతుల నుంచి ఇప్పటివరకు రూ. 16,760 కోట్ల విలువైన ధాన్యాన్ని కొని రూ. 15,121 కోట్లు చెల్లించాం.
కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
యాసంగి కొనుగోళ్ల కోసం ఏర్పాటు చేసిన 8,378 కేంద్రాల్లో మౌలికవసతుల కల్పనతోపాటు వర్షం పడినా రైతులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే ఉన్న 2.5 లక్షల టార్పాలిన్లకు అదనంగా లక్ష టార్పాలిన్లను పంపించాం. దక్షిణాదిలోనే తొలిసారిగా 830 ప్యాడీ క్లీనర్లు, ధాన్యం ఆరబెట్టేందుకు డ్రైయర్లను కొనుగోలు చేసి రైతులకు అందుబాటులో ఉంచాం. తద్వారా పచ్చి ధాన్యాన్ని, రాళ్లురప్పలు ఉన్న ధాన్యాన్ని కూడా శుభ్రం చేసి కొని మిల్లులకు పంపాం.
783 మంది డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం నిలిపివేశాం
రాష్ట్రంలో 3 వేలకుపైగా ఉన్న మిల్లుల్లో 2022–23లో యాసంగి ధాన్యం సీఎంఆర్ చేయకుండా ఎగ్గొట్టిన మిల్లర్లతోపాటు కొన్నేళ్లుగా బకాయిపడ్డ మిల్లర్లకు యాసంగిలో ధాన్యం కేటాయించలేదు. రాష్ట్రవ్యాప్తంగా 783 మంది మిల్లర్లను బ్లాక్ చేశాం. 2022–23 యాసంగి ధాన్యం సీఎంఆర్ ఇవ్వని మిల్లర్ల నుంచి రూ. 3,800 కోట్ల విలువైన ధాన్యం, బియ్యం లేదా అందుకు సమానమైన విలువను రికవరీ చేశాం.
ఇంకా రూ. 1,400 కోట్లు మిల్లర్ల నుంచి రావాల్సి ఉంది. మరో 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడా బియ్యాన్ని మిల్లర్ల నుంచి సేకరించి ఫిలిప్పీన్స్కు పంపిస్తున్నాం. మిస్సింగ్ కింద చూపించిన (మిల్లర్లు అమ్ముకున్న) 5.4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సమానమైన రూ. 1,000 కోట్లను సంబంధిత మిల్లర్ల నుంచి రికవరీ చేయాల్సి ఉంది. ఇప్పటికే నోటీసుల జారీ ప్రక్రియ మొదలైంది.
సన్నబియ్యం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట
గతంలో రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యాన్ని దళారులు తక్కువ ధరకు కొని విక్రయించేవారు. ఉగాది కానుకగా అమల్లోకి తెచ్చిన రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీతో అక్రమాలకు అడ్డుకట్టపడినట్ల యింది. నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో గ్రామాలు, పట్టణాల్లోని ప్రజలు కూడా సన్నబియ్యం కోసం క్యూలలో నిలబడి మరీ తీసుకెళ్తున్నారు.
ఫలితంగా బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. గతంలో దొడ్డుబియ్యాన్ని 20 శాతం మంది ప్రజలే వినియోగిస్తే సన్నబియ్యం 90 శాతానికిపైగా సద్వినియోగం అవుతోంది. తెలంగాణలో పండిన దొడ్డు బియ్యాన్ని నేరుగా ఫిలిప్పీన్స్కు పంపిస్తున్నాం. ఇతర దేశాలతో కూడా చర్చలు జరుగుతున్నాయి.