మూసీ పునరుజ్జీవానికి కేంద్రం అనుమతి
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్కు లైన్ క్లియరైంది. మూసీ సుందరీకరణలో భాగంగా బాపూఘాట్ ప్రాంతంలో గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న కేంద్ర రక్షణ శాఖకు చెందిన భూముల అప్పగింతకు తాజాగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని బాపూఘాట్ పరిసరాల్లో రక్షణ శాఖకు చెందిన 83.814 ఎకరాల భూమిని మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)కు బదిలీ చేసింది.
ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ (డిఫెన్స్ ల్యాండ్స్ విభాగం) ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అవుతున్న ఈ భూముల మొత్తం విలువ రూ.533.42 కోట్లు అని రక్షణ శాఖ నిర్ధారించింది. దీనికి బదులుగా రక్షణ భూముల నిబంధనల ప్రకారం సమాన విలువైన మౌలిక వసతులను సైన్యానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. కేంద్రం నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మూసీ నదిని సరికొత్త పర్యావరణ, సాంస్కృతిక కేంద్రంగా మార్చేందుకు, బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ఈ ల్యాండ్ క్లియరెన్స్ ఎంతో కీలకమని తన ‘ఎక్స్’ఖాతాలో పేర్కొన్నారు. ఈ సహకారానికిగాను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు, భారత సైన్యానికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బదిలీ చేసిన భూములివీ..
గండిపేట మండలంలోని బండ్లగూడలో సర్వే నంబర్లు 86, 87, 88లోని 25.15 ఎకరాలు, హైదర్గూడలోని సర్వే నంబరు 126లోని 5.23 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని 91, 92, 96 సర్వే నంబర్లు, హైదర్గూడలోని 123, 124, 125ల్లోని మొత్తం 39.72 ఎకరాలు, అలాగే బండ్లగూడలోని సర్వే నంబరు 94లోని 5.5 ఎకరాలు, గోల్కొండలోని ఖిలా మొహమ్మద్ నగర్లోని సర్వే నంబర్లు 3/ఎల్/15 (రెవెన్యూ సర్వే నంబర్లు 250, 251, 252లోని 8.09 ఎకరాలను ఎంఆర్డీసీఎల్కు బదిలీ చేసింది. తొలి దశలో ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (11.8 కి.మీ), హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.2 కి.మీ) మూసీని అభివృద్ధి చేయనున్నారు. ఈ మూసీ కారిడార్ పొడవునా అవసరమైన అదనపు ప్రైవేట్ భూముల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది.
త్రివేణి సంగమంగా గాంధీ సరోవర్..
మొత్తం 238 ఎకరాల్లో గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు. మూసీ, ఈసా నదులతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తరలించి బాపూఘాట్ త్రివేణి సంగమ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తయిన మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మహనీయుడి విగ్రహం ఇదే కానుంది. ప్రస్తుతం మన దేశంలో అత్యంత ఎత్తయిన గాంధీ విగ్రహం పాట్నాలోని గాంధీ మైదానంలో ఉంది. దీని ఎత్తు 72 అడుగులు (22 మీటర్లు). కాంస్య విగ్రహం.
ఈ ప్రాజె క్టులో భాగంగా గాంధీ సరోవర్ను హ్యాపెనింగ్ ప్లేస్గా నైట్ ఎకానమీగా అభివృద్ధి చేయడంతో పాటు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. గాంధీ తత్వ శాస్త్రాన్ని బోధించే మ్యూజియం, గాంధీ జీవిత చరిత్రను వివరించే ఆడిటోరియాలు, ఫొటో ఎగ్జిబిషన్లు, ధ్యాన మందిరం, చేనేత శిక్షణ కేంద్రం, భారీ వీక్షణ గోపురాన్ని నిర్మించనున్నారు. ఈ సంగమంలో బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. వ్యాపార, ఆర్ధిక కార్యకలాపాల కోసం హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. నదీ పరివాహక ప్రాంతంలో వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, షాపింగ్ మాల్స్, యాంపీ థియేటర్లు, వినోద కేంద్రాలు, ఉద్యానాలు, ఇతరత్రా యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు.


