‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు | Central Government Has Decided To Provide Electricity For All Tribal Villages | Sakshi
Sakshi News home page

‘గిరి’ సీమల్లో ‘జుగా’ వెలుగులు

Nov 3 2024 9:56 AM | Updated on Nov 3 2024 10:33 AM

Central Government Has Decided To Provide Electricity For All Tribal Villages

‘పీఎం జుగా’ అమలుతో తీరనున్న విద్యుత్‌ సమస్య
విద్యుత్‌ సౌకర్యం లేని గ్రామాలు, గూడేలకు విద్యుత్‌ లైన్‌ నిర్మాణం
టీజీ ఎన్పీడీసీఎల్‌లో విద్యుత్‌ సౌకర్యం లేని గిరిజన ఇళ్ల గుర్తింపు.. 
ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌
26,125 గృహాల విద్యుదీకరణకు కార్యాచరణ
రూ.144.42 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టు తయారీ

హన్మకొండ: అన్ని గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ కాంతులు విరజిమ్మనున్నాయి. ప్రతీ ఇంటిని విద్యుదీకరించాలని కేంద్ర ప్రభుత్వం తాజగా నిర్ణయించింది. మెజారిటీ గిరిజన జనాభా ఉండి ఇప్పటివరకు విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోని గ్రామాల్లో వెలుగులు నిండనున్నాయి. ప్రతీ ఇంటికి ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తారు. అవసరమైన చోట నూతనంగా విద్యుత్‌ లైన్లు వేయడంతోపాటు డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంతోపాటు ఇతర కారణాలతో విద్యుత్‌ లైన్లు వేయలేని గ్రామాల్లో సోలార్‌ విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తారు.

తెలంగాణ ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) పరిధిలో మెజారిటీ గిరిజన జనాభా కలిగిన 1,049 గ్రామాలు, తెలంగాణ సదరన్‌ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీఎస్‌ఎల్‌) పరిధిలో 229 గ్రామాల్లోని గిరిజన ఇళ్లలో వెలుగులు నింపనున్నారు. ఈ మేరకు ఎన్పీడీసీఎల్‌ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను తయారు చేసింది. మెజారిటీ గిరిజన జనాభా ఉన్న 695 గ్రామాల్లోని 25,393 గృహాలకు, 732 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ కార్యాలయాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం రూ.144.42 కోట్ల వ్యయం అంచనాతో డీపీఆర్‌ రూపొందించగా.. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.

దేశంలో 5 కోట్ల మందికి లబ్ధి
గిరిజనులకు మెరుగైన సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు, గ్రామాల్లో కనీస వసతులు, సౌకర్యాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధా న మంత్రి జన్‌జాతీయ ఉన్నత్‌ గ్రామ్‌ అభియాన్‌ (పీఎం జుగా) అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 63 వేల గ్రామాల్లో 5 కోట్ల మంది గిరిజనులకు ప్రయోజనం చేకూర్చాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చింది. ఈ స్కీమ్‌ ద్వారా 25 రకాల సహాయాలు అందుతాయి. 17 మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవనోపాధిలో ఉన్న కీలకమైన అంతరాలను పూడ్చేలా ఈ స్కీమ్‌ను రూపొందించారు.

రూ.144.42 కోట్ల వ్యయంతో..
ఇప్పటికే ప్రధానమంత్రి జన్‌జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్‌ ద్వారా జనసమూహాలకు దూరంగా ఉండి మౌలి క సదుపాయాలకు నోచుకోని కోలం, తొట్టి గిరిజనులు నివా సముండే ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోని 257 అవా సాల్లో 3,345 గృహాల్లో  విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. అదే విధంగా దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి ద్వారా రూ.125కే విద్యుత్‌ పంపిణీ సంస్థ సొంతగా ఖర్చులు భరించి పేదలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించింది. అయినా ఇప్పటి కీ విద్యుత్‌ సౌకర్యానికి దూరంగా ఉన్న మెజారిటీ గిరిజను లున్న గ్రామాలు, గృహాల కోసం కేంద్రం ‘పీఎం జుగా’ను తెచ్చింది.

ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 15 జిల్లాల్లో జగిత్యా ల, పెద్దపల్లి జిల్లాల్లో విద్యుత్‌ సౌకర్యం లేని గృహాలేమీ లేవు. మిగతా 13 జిల్లాల్లో 1,049 మెజారిటీ గిరిజన జనాభా కలిగిన గ్రామాలు ఉన్నట్లు గుర్తించా రు. ఇందులో 25,393 గృహాలు, 732 ప్రభు త్వ కార్యాలయాలు (మొత్తం 26,125) ఉన్నా యి. కాగా ఆన్‌ గ్రిడ్‌ ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించే వీలున్న గ్రామాలు 24,753 ఉన్నా యి. వివిధ కారణాలవల్ల విద్యుత్‌ సౌకర్యం క ల్పించడం వీలుకాని 640 గ్రామాల్లో సోలార్‌ ద్వారా గృహాలను విద్యుదీకరించనున్నారు. ఈ గ్రామాలు, గృహాల కు విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి రూ.144.42 కోట్ల వ్య యంతో 352 కిలోమీటర్ల మేర 11 కేవీ లైన్, 592 కి.మీ. సింగిల్‌ లైన్, 1,668 కి.మీ. ఎల్‌టీ లైన్‌ నిర్మించనున్నారు. 1,565 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు బిగించనున్నారు. ఈ స్కీమ్‌ అమలుకు కావాల్సిన ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement