2047కి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్‌’ | Cabinet approves formulation of Telangana Rising Policy Document | Sakshi
Sakshi News home page

2047కి త్రీ ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీ.. ఇదీ మా ‘విజన్‌’

Jun 24 2025 1:18 AM | Updated on Jun 24 2025 1:18 AM

Cabinet approves formulation of Telangana Rising Policy Document

మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్‌

తెలంగాణ రైజింగ్‌ పాలసీ డాక్యుమెంట్‌ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణ 

రూపకల్పన, ప్రణాళికల తయారీకి జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో త్వరలో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు

నాలెడ్జ్‌ పార్ట్‌నర్లుగా నీతి అయోగ్, ఇండియన్‌ స్కూల్‌ అఫ్‌ బిజినెస్‌

విజన్‌ రూపకల్పనలో అన్ని ప్రభుత్వ శాఖలకు భాగస్వామ్యం 

మంత్రివర్గ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకిటి 

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ అలైన్‌మెంట్‌కు ఓకే

‘బనకచర్ల’పై చట్టపరంగా, న్యాయపరంగా పోరాటం చేయాలని తీర్మానించిన మంత్రివర్గం 

కాళేశ్వరం కమిషన్‌కు అప్పటి కేబినెట్‌ భేటీల మినిట్స్‌ ఇవ్వాలని నిర్ణయం 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సుదీర్ఘ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌ పాలసీ’ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించింది. ఈ మేరకు విజన్‌ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయనుంది. 

తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్‌ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళికలు ఈ విజన్‌ డాక్యుమెంట్‌లో ఉండనున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటల నుంచి రాత్రి 9.20 గంటల వరకు సచివాలయంలో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

మహిళలు, రైతులు, యువత సంక్షేమానికి ప్రాధాన్యం 
విజన్‌ డాక్యుమెంట్‌ రూపకల్పనలో అన్ని శాఖలు, అన్ని విభాగాలు భాగస్వామ్యం పంచుకునేలా చూడాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశిస్తున్న వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్‌ డాక్యుమెంట్‌లో పొందుపరుస్తారు. విజన్‌ డాక్యుమెంట్‌ తయారీకి నీతి అయోగ్‌తో పాటు, ఇండియన్‌ స్కూల్‌ అఫ్‌ బిజినెస్‌ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్‌ పార్టనర్లుగా వ్యవహరిస్తాయి. 

కేంద్రం ప్రకటించిన వికసిత్‌ భారత్‌ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్‌కు రూపకల్పన చేయాలని అధికారులకు కేబినెట్‌ దిశా నిర్దేశం చేసింది. 

రైతుల సమక్షంలో సంబరాలు 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను విజయవంతంగా, రికార్డు వేగంతో అందించింది. సీఎం రేవంత్‌రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. మిగిలిన రూ.400 కోట్లను మంగళవారం జమ చేయనుంది. కోటీ 49 లక్షల ఎకరాలకు ఈ సాయాన్ని పంపిణీ చేసింది. అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలోని దాదాపు 71 లక్షల మంది రైతులకు రైతు భరోసా సాయం అందించింది. ఈ ఘనత సాధించిన శుభ సందర్భాన్ని రైతుల సమక్షంలోనే ఉత్సవంగా జరుపుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది.  

సచివాలయం ఎదురుగా రాజీవ్‌ విగ్రహం వద్ద.. 
మంగళవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద 2 వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌తో పాటు మంత్రివర్గం ఈ కార్యక్రమంలో పాల్గొననుంది. ఇక అన్ని జిల్లాల్లో రైతు వేదికలతో పాటు మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సంబరాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆదేశించింది.  

ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం     
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లో డిసెంబర్‌ 9న ఈ విగ్రహాలను ఆవిష్కరించనున్నారు.  

ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ అలైన్‌మెంట్‌కు ఓకే 
హైదరాబాద్‌ చుట్టూ నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ ప్రతిపాదనలకు కేబినెట్‌ తుది ఆమోదం తెలిపింది. అంతకుముందు ఆర్‌ అండ్‌ బీ విభాగం తయారు చేసిన మూడు ప్రతిపాదనలను పరిశీలించింది. అనంతరం చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు 201 కి.మీ.ల పొడవు ఉండే ఈ అలైన్‌మెంట్‌కు ఆమోదం తెలిపింది.  

జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం 
తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఏపీ తలపెట్టిన గోదావరి –బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టును చట్టపరంగా, న్యాయపరంగా అడ్డుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అన్ని వేదికలను ఉపయోగించుకోవాలని కేబినెట్‌ తీర్మానించింది. ఒక చుక్క గోదావరి జలాలను కూడా నష్టపోకుండా చిత్తశుద్ధితో పోరాడాలని నిర్ణయించింది. 

2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించాలని నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించగా, దాని ఆధారంగానే బనకచర్ల ప్రాజెక్టును ఏపీ రూపొందించిందని మంత్రివర్గం పేర్కొంది. ఈ విషయాన్ని మరిచిపోయిన బీఆర్‌ఎస్‌ నేతలు తమ ప్రభుత్వంపై అబద్ధాలతో గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. 

ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను వివరించడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణను సిద్ధంచేసేందుకు జూలై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం నిర్వహించనుంది. ప్రాజెక్టుపై పూర్తి వివరాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది.   

విభజన వివాదాలపై మళ్లీ చర్చలు 
రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాల్లో ఇంకా అపరిష్కృతంగా ఉండిపోయిన అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీల ఆధ్వర్యంలో మళ్లీ సమావేశాలను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీకి లేఖ రాయనుంది.  

‘కాళేశ్వరం’ సమాచారాన్ని కమిషన్‌కు ఇవ్వనున్న సర్కార్‌ 
కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా తెలియజేయాలనుకున్నా, సమాచారం ఇవ్వాలనుకున్నా ఈ నెల 30 లోగా ఇవ్వాలని జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ రాసిన లేఖపై మంత్రివర్గం చర్చించింది. ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమాచారాన్ని గడువులోగా కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించింది. 

సీఎస్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ అధికారులకు ఈ బాధ్యత అప్పగించింది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు మేరకే బరాజ్‌లను నిర్మించినట్టు కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్, ఈటల రాజేందర్‌ వాంగ్మూలం ఇచ్చారు. 

నాటి మంత్రి హరీశ్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బరాజ్‌ల నిర్మాణంపై నిపుణుల కమిటీ సిఫారసులను ఆమోదించిన తర్వాతే మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ఈటల, హరీశ్‌రావు కమిషన్‌కు వివరించారు. 

ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘంతో పాటు మంత్రివర్గ సమావేశాల్లో అలాంటి నిర్ణయాలు ఏమీ జరగలేదని రుజువు చేసేందుకు గాను వాటికి సంబంధించిన మినిట్స్‌ కాపీలను కమిషన్‌కు ప్రభుత్వం అందించనుంది.   

తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీకి ఆమోదం 
రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడా ప్రమాణాలను పెంపొందించి 2036 ఒలంపిక్స్‌లో తెలంగాణ సత్తాను చాటాలనే ఉద్దేశంతో రూపొందించిన తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీని కేబినెట్‌ ఆమోదించింది.  

మంత్రివర్గ నిర్ణయాలపై త్రైమాసిక సమీక్ష     
పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతినెలా రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించనుంది. మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించడానికి త్రైమాసిక సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.   

మున్సిపాలిటీలుగా ఇంద్రేశం, జిన్నారం 
సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జిన్నారంను కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఇస్నాపూర్‌ మున్సిపాలిటీని అప్‌ గ్రేడ్‌ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. 

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నోరి దత్తాత్రేయుడు 
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ క్యాన్సర్‌ చికిత్స నిపుణులు నోరి దత్తాత్రేయుడిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆస్పత్రి అభివృద్ధితో పాటు, క్యాన్సర్‌ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆయన సేవలను వాడుకోనుంది. ఎంఎన్‌జే ఆస్పత్రి అప్‌గ్రేడేషన్, సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది. 

బాసర ట్రిపుల్‌ ఐటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కాలేజీ 
ఈ విద్యా సంవత్సరంలో బాసర ట్రిపుల్‌ ఐటీ కింద మహబూబ్‌నగర్‌లో ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేసి ఏటా 180 మంది విద్యార్థులు చొప్పున 6 ఏళ్లలో 1080 మందికి అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్‌లో శాతవాహన వర్సిటీ కింద ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేసి 240 మందికి అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించింది. శాతావహన వర్సిటీలో ఈ ఏడాది నుంచి చెరో 60 సీట్లతో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement