
హైదరాబాద్: గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి ఈరోజు(ఆదివారం) ఉదయం మృతిచెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడ గంటల ప్రాంతంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడమ మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించారు. మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలకు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. కేటీఆర్, హరీష్ రావు తదితర నేతలు గోపీనాథ అంతిమ సంస్కారాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు.