
21న బరాజ్లు, రిజర్వాయర్ల వద్ద నిరసన
హరీశ్రావు నేతృత్వంలో ఆందోళన
గోదావరి–బనకచర్ల లింక్పైనా ఆందోళనకు యోచన
వచ్చే నెలలో రాష్ట్ర బంద్, సడక్ బంద్కు సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ను మరమ్మతు చేసి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 21న పోరుబాట చేపట్టనుంది. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. పోరుబాట కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బరాజ్లు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లను సందర్శిస్తారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆ పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు మరో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వచ్చే నెలలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ లేదా సడక్ బంద్ చేపట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా కార్యాచరణ ప్రకటించే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
నేడు లండన్కు కేటీఆర్
ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే రెండు రోజుల సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు. దేశ ప్రగతి, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, టెక్నాలజీ తదితరాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం రాత్రి కేటీఆర్ లండన్కు బయలుదేరనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్కు తిరిగి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
కాగా వైద్య పరీక్షల కోసం నందినగర్ నివాసానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మరో రెండు రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. ఇక్కడే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అమెరికాలోని డాలస్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణలో క్రియాశీలంగా పనిచేసిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాలా మంగళవారం కేసీఆర్ను కలిశారు. డాలస్ సభను విజయవంతంగా నిర్వహించిన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేతలను కేసీఆర్ అభినందించారు.