పోర్టల్‌ ప్రక్షాళనతోనే పరిష్కారం 

Bandi Sanjay To Telangana Govt Resolve Glitches In Dharani Portal - Sakshi

‘ధరణి’సమస్యలు పరిష్కరించాలని బీజేపీ రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ 

అసైన్డ్‌ భూములపై శాశ్వత హక్కులు కల్పించాలి 

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ వెంటనే స్పందించి, రెవెన్యూ, ధరణి పోర్టల్‌ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. తప్పులతడకగా మారిన ధరణి పోర్టల్‌ను ప్రక్షాళన చేయకపోతే ప్రజలు పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన ‘రెవెన్యూ చట్టాలు– ధరణిలో లోపాలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

దీనికి హాజరైన మాజీ సైనికాధికారులు, స్వాతంత్య్ర సమ రయోధులు, భూబాధితుల సంఘం నాయకులు, పలువురు సాంకేతిక నిపుణులు మాట్లాడుతూ ధరణి లోపాల గురించి వివరించారు. అసైన్డ్‌ భూముల శాశ్వత హక్కుల సాధన సంఘం నేతలు గుమ్మి రాజ్‌కుమార్‌రెడ్డి, మన్నె నర్సింహారెడ్డి మాట్లాడుతూ ‘రాష్ట్రంలో ఉన్న 24 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములను 14 లక్షల పేద రైతు కుటుంబాలు సా గు చేసుకుంటున్నాయి. వీటిపై ఆ రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలి’అని అన్నారు.

సీనియర్‌ అడ్వొకేట్‌ గోపాల్‌ శర్మ మాట్లాడుతూ రెవెన్యూచటాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిలో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌లకు కూడా తగిన అధికారాలు లేవన్నారు. ధరణి వల్ల ఇబ్బందులు పడుతున్న  రైతులు మాట్లాడుతూ ‘అమ్మిన భూములకు  పాత యజమానుల పేర్లే ధరణిలో కన్పిస్తున్నాయి. ప్రతి  కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్‌ సెల్‌లో 80 శాతం దరఖాస్తులు ధరణి లోపాలపైనే కావడం సిగ్గు చేటు’అని అన్నారు. రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాంగోపాల్‌ మాట్లాడుతూ  గ్రామ పరిపాలనకు సమాధి కడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.  

సీఎం మాటలకు, చేతలకు పొంతన లేదు: బండి  
‘ధరణి పోర్టల్‌ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు పరిష్కారంకాలేదు. దీనిపై సీఎం మాటలకు, చేతలకూ పొంతన లేదు’అని బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌ సమస్యలపై 5 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే, సమస్య తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘ధరణి పోర్టల్‌ పెట్టింది, ప్రజాసమస్యల పరిష్కారానికా, వేలకోట్ల  విలువైన భూములను దండు కోవడానికా’అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజాయితీ ఉం టే, ధరణి బాధ్యతలను పేరుగాంచిన సంస్థలకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top