
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
వేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచి్చంది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు తప్పిన పెను ప్రమాదం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు.
ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.