ములుగు జిల్లా మంగపేట అటవీప్రాంతంలో నేలకొరిగిన భారీ వృక్షాలు
సాక్షి, హైదరాబాద్/ మంగపేట/ములుగు: ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రానికి సమీపంలోని సండ్రోనిఒర్రె వద్ద మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా టోర్నడోను తలపించే విధంగా సుడిగాలి వచ్చింది. మండల కేంద్రం నుంచి కోమటిపల్లి వెళ్లే మార్గంలో శాంతినగర్ గొత్తికోయగూడేనికి వెళ్లే దారి వద్ద భారీ గాలులకు పది ఎకరాల విస్తీర్ణంలో దట్టంగా ఉన్నచోట సుమారు 15కు పైగా భారీ వృక్షాలు వేర్లతో సహా నెలకొరిగాయి. 20కి పైగా చెట్లకొమ్మలు విరిగిపోగా, పలచగా ఉన్న యూకలిప్టస్ ప్లాంటేషన్లోని చెట్లు సైతం నేల కూలాయి. నేలకొరిగిన భారీ వృక్షాల్లో డంపిడి, ముస్తి, ఈపీ జాతులకు చెందినవి అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. సంఘటనస్థలాన్ని మంగపేట రేంజ్ అధికారి లాయక్ హుస్సేన్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 10కిపైగా భారీ వృక్షాలు పడిపోయినట్టు గుర్తించామని, చీకటిపడడంతో బుధవారం ఉదయం పూర్తిస్థాయిలో పరిశీలిస్తే ఎన్ని చెట్లు పడిపోయాయనే విషయం తెలుస్తుందన్నారు. బలమైన గాలులకు పడిపోయాయా లేక టోర్నడో వల్ల పడిపోయాయా అనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. కోమటిపల్లి వెళ్లే రోడ్డుపై వృక్షాలు అడ్డంగా పడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యానయ్య, మాసిరెడ్డివెంకట్రెడ్డి, స్థానికుల సహకారంతో తొలగించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు..
» 2024, ఆగస్టు 31న తాడ్వాయి మండల కేంద్రం నుంచి మేడారం వెళ్లే ప్రధాన రోడ్డు వెంట అటవీ ప్రాంతంలో బలమైన గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి.
» ఈ ఏడాది ఏప్రిల్ 22న ఇదే తరహాలో కమలాపురంలో భారీ గాలులు వీచడంతో 105 విద్యుత్ స్తంభాలు విరిగిపోయి కరెంటు లైన్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రూ.30 లక్షల వరకు నష్టం జరిగింది.


