స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలి | Allocation should be done on the basis of locality | Sakshi
Sakshi News home page

స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలి

Oct 3 2024 4:19 AM | Updated on Oct 3 2024 4:19 AM

Allocation should be done on the basis of locality

గాందీభవన్‌ ఎదుట జీవో 317 బాధితుల ఆందోళన  

కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న బాధితులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లో భాగంగా తీసుకొచ్చిన జీవో 317 ద్వారా తీవ్రంగా నష్టపోయామంటూ బాధిత ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, కానీ పది నెలలైనా ఆ హామీని అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్థానికత ఆధారంగా కేటాయింపులు జరపాలని డిమాండ్‌ చేస్తూ బాధిత ఉద్యోగులు బుధవారం గాందీభవన్‌ను ముట్ట డించారు. గాం«దీభవన్‌ ఎదుట రోడ్డుపైన ఉద్యోగులు బైఠాయించి నిరసన తెలి పారు. జీవో 317కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగి చదువుకున్న ప్రాంతాన్ని స్థానికతగా పరిగణించాలని, అలాకాకుండా సంబంధం లేని ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపులు జరిపి తమ భవిష్యత్తును ఆందోళనకరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు గాం«దీభవన్‌ వద్ద మోహరించారు. 

నిర్ణయం తీసుకోకపోవడంపై ఆగ్రహం 
జీవో 317 బాధితుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉసంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ సభ్యులుగా ఉన్నారు. 

బాధిత ఉద్యోగుల నుంచి వినతులు స్వీకరించిన ప్రభుత్వం.. వాటి పరిష్కారానికి సంబంధించిన బాధ్యతలను మంత్రివర్గ ఉపకమిటీకి అప్పగించింది. ఈ కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు ఎనిమిది నెలలైనా ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఆగ్రహించిన బాధిత ఉద్యోగులు ప్రస్తుతం ఆందోళనబాట పట్టారు.  

పరిష్కారానికి మంత్రి, మహేశ్‌గౌడ్‌ హామీ 
ఆందోళన చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ గాం«దీభవన్‌ లోపలికి పిలిచి చర్చలు జరిపారు. జీవో 317పై ప్రభుత్వం సబ్‌కమిటీని నియమించిందని, పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ నెల 3న సబ్‌కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ ఉంటుందని హామీనిచ్చారు. దీంతో ఉద్యోగులు ఆందోళనను విరమించారు. 

Advertisement
 
Advertisement
Advertisement