రంగారెడ్డి : డీఆర్డీఏ ద్వారా ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామంటూ రెండేళ్ల క్రితం అడ్మిషన్లు ఇచ్చిన కాలేజీ నిర్వాహకులు కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సాగర్ రహదారికి ఆనుకుని ఉన్న న్యూ శ్రీచైనత్య కళాశాలలో రెండేళ్ల క్రితం ఫ్రీ అడ్మిషన్స్ ఇచ్చారు. చదువు ముగిసి, సర్టిఫికెట్లు కావాలని అడిగితే ఫీజులు చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. మెమోలు, టీసీలు లేకపోవడంతో డిగ్రీతో పాటు, ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు హాజరు కాలేని దుస్థితి నెలకొంది. ఈవిషయమై సోమవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాలేజీ యాజమాన్యాన్ని నిలదీయగా గేటుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక బాధిత స్టూడెంట్లు సాగర్ రహదారిపై బైఠాయించారు.
స్తంభించిన వాహనాలు
సాయంత్రం వేళ రద్దీగా ఉండే సాగర్ రోడ్డుపై గంటన్నర పాటు ధర్నా చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
విద్యార్థులపై చేయిచేసుకున్న సీఐ
గంటన్నర తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవికుమార్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక దశలో సహనం కోల్పోయి అమ్మాయిలు, అబ్బాయిలు అనే తేడా లేకుండా పలువురిపై చేయి చేసుకున్నారు. స్టూడెంట్ యూనియన్ల నాయకులపై సైతం దాడి చేసి, తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. సీఐ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన కొంతమంది విద్యార్థునులు రోదిస్తూ అక్కడే కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత మహిళా పోలీసులు వచ్చి మళ్లీ వారిపై చేయి చేసుకోవడం, దుర్భాషలాడటంతో సాధారణ ప్రజలు తిరగబడ్డారు. ఈవిషయమై సీఐని నిలదీయగా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
వేటు తప్పదా..?
ఆందోళన చేస్తున్న ఓవిద్యార్థిపై చేయి చేసుకున్న కారణంగా సీఐ రవికుమార్పై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈవిషయంపై సీపీ సజ్జనర్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం.


