ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్ ఇంట్లో దొరికిన బంగారు నగలు, నగదు
ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు
హైదరాబాద్, నిజామాబాద్ సహా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు
వ్యవసాయ భూములు, ఫ్లాట్లు, విల్లా, నగదు, బంగారం గుర్తింపు
ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17.94 కోట్లు
మార్కెట్ విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా
సాక్షి, హైదరాబాద్: రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో భారీ అవినీతి అనకొండ ఏసీబీ అధికారులకు చిక్కింది. ఆ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్పై అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చట్టబద్ధ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ నేతృత్వంలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
మియాపూర్లోని ఆయన నివాసం, ఎర్రమంజిల్లోని కార్యాలయం, నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లోని బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17,94,62,617 అని ఏసీబీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
భూములు, ఫ్లాట్లు, విల్లాలు..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అధికారిక విలువ ప్రకారం దీని ధర రూ.82.89 లక్షలు. కొంపల్లిలో 3, గచ్చి»ౌలిలో 4 కలిపి మొత్తం 7 ఫ్లాట్లు గుర్తించారు. వీటి అంచనా విలువ రూ.7.34 కోట్లు. మియాపూర్లో ట్రిప్లెక్స్ విల్లా విలువ రూ.2.50 కోట్లు, కూకట్పల్లిలో కొత్తగా నిర్మించిన ఇంటి విలువ రూ.62.14 లక్షలుగా పేర్కొన్నారు. నిజామాబాద్లో నిర్మిత విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోదాల్లో రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు గుర్తించారు.
సుమారు 2.5 కిలోల బంగారు ఆభరణాలు, గోల్డ్ బిస్కెట్లు స్వా«దీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు. అలాగే 6 కిలోల వెండి ఆభరణాలు, రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, 9 మొబైళ్లు, 4 ల్యాప్టాప్లు సహా రూ.11.25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలు గుర్తించారు. రూ.4.44 లక్షల విలువైన 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను కూడా సీజ్ చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. దీనిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు కూడా సోదాలు?
సోదాల అనంతరం మోహన్ నాయక్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించే అవకాశం ఉంది. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశముందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ఆర్అండ్బీలో కలకలం
భారీ ప్రాజెక్టులు, టెండర్లు, నిర్మాణ పనులకు సంబంధించిన నిర్ణయాధికార స్థానంలో ఉన్న ఆర్అండ్బీ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం శాఖలో కలకలం రేపింది. బినామీ ఆస్తులు, పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
వందల కోట్ల అవినీతిలో అక్రమార్కులు
రాష్ట్రంలో ఉన్నతాధికారుల అవినీతి వ్యవహారాలు వరుసగా బయటపడుతున్నాయి. ఏకంగా వందల కోట్లలో అవినీతి కార్యకలాపాలు ఏసీబీ దాడుల్లో వెలుగుచూస్తున్నాయి. తనిఖీల్లో నగదు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంకు లాకర్లు, భూములు, ప్లాట్లు, ఫ్లాట్ల పత్రాలు పెద్ద ఎత్తున బయటపడటం రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయికి చేరిందో చాటుతోంది. ఈఎన్సీలు, అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, అదనపు ఎస్పీలు, మునిసిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారులు సైతం భారీ అక్రమాస్తుల కేసుల్లో చిక్కుతున్నారు.
హెచ్ఎండీఏ డైరెక్టర్గా పనిచేసిన శివ బాలకృష్ణ వద్ద బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.200 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు అప్పట్లో అంచనా వేశారు. నీటిపారుదల శాఖలో కాలేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్, మాజీ ఈఎన్సీ మురళీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ పేర్లు కూడా అవినీతి ఆరోపణల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో అదనపు కలెక్టర్గా పనిచేసిన అధికారి, ఫోన్ ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన నాయిని భుజంగరావు, జలమండలిలో ఇటీవల పట్టుబడిన ఉన్నతాధికారి, మేడ్చల్ మల్కాజ్గిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్ ఆస్తులు పదుల కోట్లలో ఉంటే.. కొందరి ఆస్తులు ఏకంగా వందల కోట్లు దాటుతున్నాయి.


