సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న 80ల లుక్
రాజకీయ నేతలు, సినీ తారల నుంచి సామాన్యుల దాకా..
నాటి హెయిర్స్టైల్.. డ్రెస్.. స్టూడియో పోజులు
సాక్షి, హైదరాబాద్: 1980ల నాటి రెట్రో లుక్ ఇప్పుడో క్రేజ్గా మారింది. ఏఐ ఆధారిత ఇమేజ్ జనరేషన్ దీనికి వేదికగా మారింది. అప్పటి సెలబ్రిటీలు అనుసరించిన ఫ్యాషన్స్ను కాపీ కొడుతూ ఏఐ సాయంతో సృష్టిస్తున్న ఇమేజ్లు సోషల్ మీడియా స్టేటస్లు, పోస్టులలో అందర్నీ ఆకర్షిస్తున్నాయి. అప్పటి దుస్తులు, జుట్టు తీరు, పరిసరాలు వంటి అంశాలను తలపించేలా ఈ చిత్రాలు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఇలాంటివి సెలబ్రిటీలు, సామాన్యులకు పరిమితం కాగా.. ఈసారి రాజకీయ నేతలు కూడా చాలామంది ఈ లుక్ను ట్రై చేయడం విశేషం. ఇన్స్ట్రాగామ్, ఎక్స్ తదితర వేదికల్లో సాధారణ యువత నుంచి ప్రముఖుల వరకు ఈ ‘80ల ట్రెండ్’ను అనుసరిస్తున్నారు.
ఫ్లాష్ బ్యాక్లోకి ఇలా...
ముందుగా చాట్జీపీటీలో వ్యక్తులు తమ ఫొటోను అప్లోడ్ చేసి, దానిని 1980ల నాటి లుక్తో ఫొటోలా మార్చాలని సూచిస్తూ సవివరమైన ప్రాంప్ట్ ఇవ్వాలి. వ్యక్తి ముఖ లక్షణాలు, సహజమైన చర్మ ఛాయ, దీని ద్వారా నాటి సంప్రదాయ దుస్తులు, సహజమైన పోజులు, పాత ఫిల్మ్ కెమెరాతో తీసినట్లుగా కనిపించే ఫొటోలను కోరవచ్చు. అలాగే పాతకాలపు ఇళ్లు, సాదాసీదా దుస్తులతో అప్పటి జీవనాన్ని ప్రతిబింబించేలా కూడా చిత్రం రూపొందించుకోవచ్చు. అప్పటి పాత బస్సులు, సైకిళ్లు, దుకాణాలు, సినిమా పోస్టర్లు వంటి అంశాలను కూడా జోడించవచ్చు.
రాజకీయ నాయకులు సైతం ‘రెట్రో’లోకి..
ఈ ట్రెండ్ సామాన్యులకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్రమోదీ, రాహుల్గాందీల 80ల లుక్ను ఆయా పార్టీలు షేర్ చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఈ ఫొటో ట్రెండ్ను ఫాలో అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ అప్డేట్స్ ఖాతాలో రేవంత్రెడ్డి, రాహుల్గాంధీ కలిసున్న ఫొటోలను 1980 ట్రెండ్లోకి మార్చి పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కూడా నాటి ట్రెండ్ ఫొటోను షేర్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, ఎంపీ రేణుకా చౌదరి సహా పలువురు ప్రముఖులు ఈ ట్రెండ్కు భిన్నంగా 80ల నాటి తమ ఒరిజినల్ ఫొటోను పంచుకున్నారు.
నకిలీలతో జాగ్రత్త..
ఇదిలా ఉండగా తాజా ట్రెండ్ ను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. 1980 పేరుతో నకిలీ యాప్స్ను సృష్టించి.. వాటి ద్వారా ఏపీకే ఫైల్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.


