IT Officers Given Notice To BRS MP Kotha Prabhakar Reddy - Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఇంట్లో ఐటీ సోదాలు.. రంగంలోకి ఈడీ

Jun 15 2023 3:03 PM | Updated on Jun 15 2023 3:17 PM

IT officials Gievn Notice To BRS MP Kotha Prabhakar Reddy - Sakshi

సాక్షి, మెదక్‌: తెలంగాణ బీఆర్‌ఎస్‌ నేతల ఇళ్లలో ఐటీ దాడులు పొలిటికల్‌గా కలకలం సృష్టించాయి. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్న బీజేపీపై బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు.. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. 

ఇక, ఐటీ సోదాలు ముగిసిన అనంతరం అధికారులు.. ఎంపీ ప్రభాకర్‌ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు. అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలని అధికారులు తెలిపారు. మరోవైపు, పైళ్ల శేఖర్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, కంపెనీల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆరా తీస్తున్నారు. కంపెనీల ఆదాయం, ఐటీ రిటర్న్స్‌ వ్యత్యాసాలపై పత్రాలను పరిశీలిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు, లాకర్స్‌ వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.  ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన మామ మోహన్‌రెడ్డి  ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు అధికారులు. 

ఈ తనిఖీల్లో భాగంగా భారీగా నగదు, కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు సీజ్‌ చేశారు. కాగా, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, మర్రి జనార్ధన్‌ రెడ్డి, పైళ్ల శేఖర్‌ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. మెయిన్ ల్యాండ్స్ డిజిటల్ టెక్నాలజీ సంస్థకు డైరెక్టర్‌గా శేఖర్‌ రెడ్డి భార్య పైళ్ల వనిత రెడ్డి ఉన్నారు. ఇదే కంపెనీకి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భార్య మంజులత కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ​కాగా, పన్నులు చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 

ఇది కూడా చదవండి: వచ్చే ఎన్నికల్లో తుపాను రాబోతోంది.. రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement