సాక్షి, చైన్నె: తమిళనాడులోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్న రైతుల కోసం గతంలో ప్రకటించిన రుణమాఫీ పథకాన్ని మరింత విస్తరిస్తూ, అదనంగా రూ. 40,000 రాయితీని అందించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల వాగ్దానంమేరకు రైతులకు తోడ్పాటుగారుణమాఫీ ప్రకటనలు సీఎంవిజయ్ చేస్తూవస్తున్న విషయం తెలిసిందే.
తొలి విడత ప్రకటన
సహకార బ్యాంకుల నుండి 14.43 లక్షల మంది రైతులు తీసుకున్న రూ. 5,932 కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తున్నట్లు జూన్లో ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన 13.34 లక్షల మంది రైతులకు చెందిన రూ. 5,267 కోట్ల రాయితీ మొత్తాన్ని జూలై 31 నాటికి నాలుగు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అదే సమయంలో ఆగస్టు 7న జరిగిన వ్యవసాయ సంఘాల ప్రతినిధుల సమావేశం అనంతరం, ఆగస్టు 17న శాసనసభలో నిబంధనలు 110 కింద సీఎం విజయ్ పంట రుణమాఫీ పథకాన్ని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు రూ. 75,000 వరకు రుణాలు తీసుకున్న వారికి పూర్తి గా మాఫీ చేశారు. అలాగే, రూ. 75,001 నుండి రూ. 1 లక్ష వరకు రుణాలు పొందిన వారిలో 2.38 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 35,000 చొప్పున రాయితీ అందించారు. ఇప్పుడు కొత్త ప్రకటన ద్వారా వారికి అదనంగా మరో రూ. 40,000 రాయితీని ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఈ కేటగిరిలోని ప్రతి రైతుకు మొత్తం రూ. 75,000 పంట రుణమాఫీ పూర్తిగా వర్తింప చేశారు. అలాగే, రూ. 1 లక్ష కంటే ఎక్కువ రుణాలు పొందిన వారికి రూ. 35,000 వరకు తగ్గింపు లభిస్తుందని వివరించారు. ఈ అదనపు రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 953 కోట్లను కేటాయించింది. దీనికి సంబంధించి సహకార శాఖ ద్వారా అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఈ నిర్ణయం వలన 2.38 లక్షల మంది రైతులకు ఆర్థిక ఊరట లభించనుంది.


