– మంత్రి రాజ్మోహన్
సాక్షి, చైన్నె: పరందూరులో ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న భూముల విషయంగా న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సమాచార, తమిళాభివృద్ధి, విద్యా శాఖ మంత్రి రాజ్ మోహన్ తెలిపారు. ప్రసిద్ధ తమిళ కవి, రచయిత తిరు.వి. కళ్యాణసుందరనార్ 143వ జయంతిని పురస్కరించుకుని చైన్నె ఎగ్మోర్లో ఆయన చిత్రపటానికి మంత్రితో పాటుగా అధికారులు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టినకొత్త నిర్ణయం మేరకు తొలిసారిగా ప్రభుత్వ అధికారిక ఉత్సవాల్లో జానపద కళారూపాలను ప్రదర్శించారు. మైలాట్టం, కరకాట్టం , జానపద కళాకారుల సంగీత ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
పరందూరు భూములపై..
పరందూరులో విమానాశ్రయ ప్రాజెక్టు రద్దు నేపథ్యంలో ప్రతిపాదిత విమానాశ్రయం కోసం రైతుల నుండి సేకరించిన భూముల విషయమై న్యాయనిపుణులతో చర్చించనున్నామని మంత్రి వివరించారు. రైతుల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.. రైతుల నుంచి భూములు సేకరించడం అంటే తల్లిని బిడ్డల నుంచి వేరు చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.రైతుల భూములను వారికి తిరిగి ఇచ్చేందుకు ఉన్న సాధ్యసాధ్యాలపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. తమిళనాడు అభివృద్ధికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ఎంతైనా అవసరమని, అయితే, పరందూరు విమానాశ్రయ నిర్మాణ విషయంలో అన్ని వర్గాల ప్రజలు, రైతులతో చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.


