సాక్షి, చైన్నె: తమిళనాడులో ఖాళీ మద్య సీసాలను తిరిగి సేకరించే పథకం కోసం ఆటోమేటిక్ వెండింగ్, రిటర్న్ మెషీన్లను కొనుగోలు చేసేందుకు టాస్మాక్ యాజమాన్యం సిద్ధమైంది. ఇందు కోసం టెండర్ల ప్రకటనను విడుదల చేశారు. అటవీ ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో తాగి పడేసే ఖాళీ మందు సీసాల వల్ల వన్యప్రాణులకు హాని కలుగుతోందన్న పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు... ఖాళీ బాటిళ్లను తిరిగి సేకరించే విధానాన్ని అమలు చేయాలని గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించి బాటిళ్లను సేకరించారు.
ఆటోమేటిక్ మెషీన్ల పనితీరు..
ప్రస్తుతం టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, బాటిళ్లను సేకరించేందుకు మానవ వనరులకు బదులుగా ఆటోమేటిక్ మెషీన్లను ఉపయోగించాలని టాస్మాక్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని ఎంపిక చేసిన దుకాణాల్లో పైలట్ ప్రాజెక్ట్గా వీటిని పరిశీలించారు. మద్యం సీసాపై ఉన్న క్యూ ఆర్ కోడ్ను ఈ మెషీన్లో స్కాన్ చేసి బాటిల్ను వేస్తే, వినియోగదారుడి మొబైల్ నంబర్ లేదా యూపీఐ క్యూ ఆర్ కోడ్ ద్వారా బాటిల్ డిపాజిట్ సొమ్ము నేరుగా వారి ఖాతాలోకి చేరుతుంది. ఈ యంత్రాలను తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టాస్మాక్ దుకాణాల్లో ఏర్పాటు చేసేందుకు తాజాగా టెండర్లు కోరారు. ఈ నెల 31 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 5వ తేదీ ఉదయం 11 గంటల వరకు టెండర్ లను సమర్పించవచ్చు. అక్టోబర్ 5వ తేదీన టెండర్లను ఓపెన్ చేయనున్నారు. తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని షాపులు , అత్యధిక రాబడి వచ్చే టాస్మాక్ దుకాణాల్లో ఈ ఆటోమేటిక్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.


