తమిళసినిమా: అరసన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇందులో శింబు కథానాయకుడుగా నటించడమే. మరో విషయం శింబు, దర్శకుడు వెట్రిమారన్లో కాంబోలో రూపొందుతున్న చిత్రం కావడం. దీన్ని వి. క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. నటి ఆండ్రియా, దర్శకుడు సముద్రఖని, అమీర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ ఇతివృత్తంతో రూపొందుతున్న అరసన్ చిత్రంలో శింబు రెండు విభిన్న గెటప్ల్లో కనిపించడం మరో విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి. ఇకపోతే ఈ చిత్రం ప్రారంభ దశ నుంచి పలు అవాంతరాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఇప్పుడు అన్ని అవరోధాలను అధిగమించి షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం అరసన్ చిత్రం షూటింగ్ చైన్నె, తరమణి లో భారీ షెడ్యూల్ ను జరుపుకుంటోందని తెలిపారు. ఇందుకోసం అక్కడ భారీ సెట్ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రం ప్రేక్షకులకు చాలా పెద్ద ట్రీట్గా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తదుపరి వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్ర సెట్లో నిర్మాత కలైపులి ఎస్. థాను, దర్శకుడు వెట్రిమారన్, నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్ కలుసుకున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు.
నటుడు
శింబుతో అరసన్
చిత్ర యూనిట్


