సాక్షి, చైన్నె: తమ ప్రధాన పండుగ ఓనంను ఆదివారం రాష్ట్రంలోని మలయాళీయులు అత్యంత భక్తితో శద్ద్రలతో సంప్రదాయ బద్దంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి ఆలయాలన్నీ మలయాళీ భక్తులతో కిట కిటలాడాయి. ఇళ్ల ముంగిట పలు రకాల పుష్పాలతో ముగ్గులను వేసి, ఆట పాటలతో సందడి చేశారు. వివరాలు.. ఓనం పర్వదినం వచ్చిందంటే చాలు మలయాళీ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సందడి వాతావరణం మిన్నంటుంది. తెలుగు వారి సంక్రాంతి, తమిళులకు పొంగల్ తరహాలో మలయాళీలకు ఓనం ప్రధాన పండుగా. అందుకే ఈ పండుగ వేళ పలు వర్ణ పుష్పాలతో ముగ్గులు, పట్టు పంచకట్టు, బంగారు వర్ణ జరితో కూడిన తెల చీరలు వంటి వస్త్రాలను ధరించి ఆట పాటలతో ఆనందాన్ని పంచుకోవడం జరుగుతోంది. విద్యా సంస్థలు, ఆయా కార్యాలయాల్లో గత ముడూ నాలుగు రోజులుగా వేడుకలను జరుపుకుంటువచ్చారు. విద్యా సంస్థలలో అయితే, భాషలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా విద్యార్థులు పట్టు పంచ కట్టు, బంగారు వర్ణ జరితో కూడిన తెల్ల చీరలను ధరించి ఆట పాటలతో సందడి చేసి ఓనం పర్వదినాన్ని ఆహ్వానించారు. బుధవారం పండుగ సందర్భంగా అనేక చోట్ల విద్యా సంస్థలతో వేడుకలు మిన్నంటాయి. విద్యార్థులు తమ మిత్రులతో కలిసి ఆనందంగా ఓనం పర్వదినానికి గడిపాడు. విందులు, వినోదాలతో సందడిచేశారు. నగరంలోని కేరళ సంఘాల నేతృత్వంలో కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. పండ్లు, ఫలాలు, పుష్పాలు కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరి నూనెలతో సిద్ధం చేసిన వివిధ రకాల పదార్థాలను వడ్డించారు.
ఆలయాల్లో పూజలు..
మలయాళీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోలాహలంగా ఓనం పండుగ జరిగింది. చైన్నె మహాలింగపురంలోని అయ్యప్ప ఆలయం భక్తులతో కిట కిటలాడింది. కొత్త వస్త్రాలను ధరించి, కుటుంబ సమేతంగా ఆలయాల్లో పూజలు చేశారు. ఈసందర్భంగా పరస్పరం ఓనం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేరళ సరిహద్దులలోని కన్యాకుమారిలోని పద్మనాభ పురం పరిసరాల్లోనూ ఓనం సందడి హోరెత్తింది. ఇక్కడ కేరళ సంప్రదాయాలను ఆచరించే వాళ్లు ఎక్కువ కావడంతో ఓనం కనుల పండువగా జరిగింది.కేరళ వాయిద్యాల హోరు, పులి వేషాలు, కర్ర సాములతో ర్యాలీలు, కళా ప్రదర్శనలు జరిగాయి. కులితురై, ములగమూరు పరిసరాలలో ఓనం మిన్నంటింది. ఆలయాలన్నీ భక్తులతో కిట కిటలాడాయి. భగవతీ అమ్మన్ ఆలయంలో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కేరళ సరిహద్దులలోని తేని, నీలగిరి, తెన్ కాశి, ఈరోడ్, కోయంబత్తూకరు, తిరుప్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో ఓనం వేడుకగా సాగింది. తమిళ, మలయాళీ ప్రజలు పండుగను తమలోని ఐక్యతను చాటే విధంగా జరుపుకున్నారు. పుష్పాలతో ముగ్గులు వేసి, ఆట పాటలతో సందడి చేశారు. విందులు, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. కోయంబత్తూరు సిత్తాపుదుర అయ్య ప్ప ఆలయం పొద్దు పోయే వరకు భక్తులతో కిట కిటాడింది. ఊటీ, ఏర్కాడు వంటి పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిక్కిరిశాయి.
కేరళ మహిళలు


